ఆస్టర్ క్వాలిటీ కేర్ కార్యకలాపాలు ప్రారంభం

– దేశ ఆరోగ్యరంగంలో కొత్త అధ్యాయం
– మధ్య తరహా నగరాలకూ అత్యాధునిక వైద్యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ విలీనం పూర్తికావడంతో ఏర్పడిన ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ జూలై 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విలీనంతో ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, ఎవర్‌కేర్, కిమ్స్‌హెల్త్ అనే నాలుగు ప్రముఖ ఆరోగ్య సంస్థలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ విలీనం రెండు సంస్థల కలయిక మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు, నిపుణుల చికిత్స, అత్యాధునిక వైద్య సాంకేతికతను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉమ్మడి లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. కొత్త సంస్థకు డాక్టర్ అజాద్ మూఫెన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతుండగా, వరుణ్ ఖన్నా మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. దక్షిణ, మధ్య భారతదేశంలో ఇప్పటికే బలమైన సేవలందిస్తున్న ఆస్టర్ క్వాలిటీ కేర్ ఇకపై మెట్రో నగరాలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న, మధ్య తరహా నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అక్కడే నిపుణుల వైద్యం, అత్యాధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించాలనేది సంస్థ లక్ష్యం. విలీన సంస్థ కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా *ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ అజాద్ మూఫెన్  మాట్లాడుతూ, “ఆస్టర్, క్వాలిటీ కేర్ ఒకే సంస్థగా మారడం మా ప్రయాణంలో కీలక ఘట్టం. ఇది రెండు ఆసుపత్రుల నెట్‌వర్క్‌లు కలవడం మాత్రమే కాదు. ఒకే విలువలు, నాణ్యమైన వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, రోగుల పట్ల నిబద్ధత కలిగిన రెండు సంస్థలు కలిసి మరింత బలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్నాయి. భవిష్యత్‌లో భారతదేశ ఆరోగ్య అవసరాలను మరింత సమర్థంగా తీర్చగల సంస్థగా ఎదుగుతాం” అని తెలిపారు. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, “ఈ విలీనంతో ఒకదానికొకటి బలంగా తోడ్పడే రెండు ఆరోగ్య సంస్థలు ఒకటయ్యాయి. ప్రతి నిర్ణయంలో రోగులు, వారి కుటుంబాల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. డిజిటల్ సాంకేతికతను మరింతగా వినియోగిస్తూ నాణ్యమైన వైద్య ఫలితాలపై దృష్టి పెడతాం. ప్రస్తుతం రోగుల చికిత్సకు ఎలాంటి అంతరాయం కలగకుండా విలీన ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే మా మొదటి లక్ష్యం. వైద్యులు, ఉద్యోగులు, భాగస్వాములు, రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్పును అనుభవించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు. ఈ విలీనంతో వైద్యులు పరస్పరం మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం పెరుగుతుంది. ఉమ్మడి చికిత్స విధానాలు, బహుళ విభాగాల వైద్యుల చర్చలు, ప్రత్యేక వైద్య కేంద్రాల ద్వారా దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో ఒకే స్థాయి నాణ్యమైన వైద్యం అందించేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే రోగులు మరింత మంది నిపుణుల అనుభవాన్ని పొందగలుగుతారు. ప్రస్తుతం సంస్థకు 28 నగరాల్లో 39 ఆసుపత్రులు, 10,600కు పైగా పడకలు ఉన్నాయి. నాగ్‌పూర్, ఔరంగాబాద్, విజయవాడ, గుంటూరు, భువనేశ్వర్, రాయ్‌పూర్, నాగర్‌కోయిల్, కొల్హాపూర్, కన్నూర్, కాసర్‌గోడ్, కొట్టక్కల్ వంటి టియర్-2, టియర్-3 నగరాల్లో అత్యాధునిక వైద్య సేవలను విస్తరించనుంది. దీంతో క్లిష్ట చికిత్సల కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనే అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ రెండు సంస్థలు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాయి. నాగర్‌కోయిల్‌లో తొలి లైనాక్ ఆధారిత రేడియేషన్ థెరపీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, రాయ్‌పూర్, తిరువనంతపురం, కొల్హాపూర్‌లలో రోబోటిక్ శస్త్రచికిత్సలను విస్తరించడం, త్వరలో గుంటూరు, విజయవాడల్లో కూడా వాటిని ప్రారంభించడం అందులో భాగం. దీంతో రోగులకు ఆధునిక వైద్యం దగ్గర్లోనే అందడమే కాకుండా, ప్రతిభావంతులైన వైద్యులు కూడా ఈ నగరాల్లో సేవలందించే అవకాశం పెరుగుతోంది. భవిష్యత్‌లో గామా నైఫ్, జాప్ వంటి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ వ్యవస్థలు, 10 రోబోటిక్ శస్త్రచికిత్స యంత్రాలు, ఇతర అత్యాధునిక వైద్య సాంకేతికతల్లో పెట్టుబడులను మరింత పెంచనుంది. అలాగే టియర్-2, టియర్-3 నగరాల్లో 12 కొత్త లైనాక్ రేడియేషన్ థెరపీ యంత్రాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ చికిత్సను మరింత మందికి అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే సంవత్సరాల్లో సంస్థలోని మొత్తం పడకల సంఖ్యను 15 వేలకుపైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 45 వేలకుపైగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సేవల నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. సంస్థ విస్తరణతో మరిన్ని వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవలు మరింత మంది ప్రజలకు చేరువ కానున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *