అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు

– నాపై కూడా దాడికి తెగబడ్డారు
– ఫేస్‌బుక్ పేజీలో మమత ఫోన్‌కాల్ ఆడియో

కోల్‌కతా, మే 5: కౌంటింగ్ సెంటర్‌లో తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. భబానీపూర్‌లో తుది రౌండ్ల కౌంటింగ్ తమ ప్రాంతానిదని, ఆ సమయంలో కొందరు గూండాలు కౌంటింగ్ సెంటర్‌లోకి ప్రవేశించారని, తనను కొట్టారని, సీఆర్పీఎఫ్ సహాయంతో తమ ఏజెంట్లను తోసేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. కీలక సమయంలో కౌంటింగ్ హాల్‌లోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. ఇక్కడ కౌంటింగ్ పక్రియ ఆసక్తిగా సాగింది. 20 రౌండ్ల కౌంటింగ్‌లో ఆరంభంలో మమతా బెనర్జీ రెండు వేల వోట్ల మెజారిటీతో ఉన్నారు. ఏడో రౌండ్ సమయానికి ఆమె 17 వేల వోట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ సమయంలో టీఎంసీ మద్దతుదారులు దాదాపు సంబరాలు చేసుకున్నారు. తర్వాత ఫలితాల్లో మార్పు మొదలైంది. 14వ రౌండ్ ముగిసే వరకు మమత ఆధిక్యం నాలుగు వేలకు పడిపోయింది. కొన్ని రౌండ్ల తేడాలోనే నాటకీయంగా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన 15,105 వోట్ల్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి దీదీకి షాక్ ఇచ్చారు. 16వ రౌండ్ వరకు తానే లీడింగ్‌లో ఉన్నానని, కానీ తమ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను తొలగించిన తర్వాత మార్పు మొదలైనట్లు ఆమె ఆరోపించారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లను సరైన సీలింగ్ లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని, తుది రౌండ్ల కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ హాల్‌లో టీఎంసీ ప్రతినిధులు లేరని పేర్కొన్నారు. చిత్రహింసకు గురిచేసినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం, బీజేపీ ఆదేశాల ప్రకారమే ఎన్నికల సంఘం, సీఆర్పీఎఫ్, స్థానిక ఎన్నికల అధికారులు వ్యవహరించినట్లు విమర్శించారు. వోటర్ రోల్స్‌లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. బలవంతంగా వోట్లను చోరీ చేశారన్నారు. అన్ని ఆధారాలను డాక్యుమెంట్ చేశామని, వాటిని కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపారు. ఇది బీజేపీ విజయం కాదు.. అనైతిక గేమ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 81 సీట్లు వచ్చాయని తేలింది. బీజేపీ 206 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది.

బెంగాల్, అసోంలలో వోటు చోరీ : మరోమారు రాహుల్ విమర్శలు  

న్యూదిల్లీ, మే 5: బెంగాల్, అసోంలో వోటు చోరీ జరిగిందని విపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి చెందడంతో కొందరు కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్, అసోం రాష్ట్రాల్లో జనాదేశాన్ని బీజేపీ చోరీ చేసిందని ఆరోపించారు. ఇది కేవలం ఓ పార్టీ ఓటమి కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే ప్రమాదకర పరిణామం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు.. దేశ అస్తిత్వానికి సంబంధించిన సమస్య’ అని పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య అనైక్యత పెరుగుతున్న నేపథ్యంలో అది బీజేపీకి వరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్, అసోంలలో చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్య వినాశనానికి సంకేతాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. విపక్షాలు పరస్పర విభేదాలను తగ్గించి ప్రజాస్వామ్య రక్షణ కోసం ఒకే వేదికపైకి రావాలని సూచించారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *