కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు
నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు
బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4:  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని,  ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.  డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయన్నారు.  అలాగే  నిన్న పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన వోటింగ్ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటేశాయి.

నేడు జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయి. ఇక అవినీతి కేసుల సంగతి పూర్తిగా మరిచిపోయారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులంతా కోడై కూశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతి చేశారని పదేపదే ప్రచారం చేశారు.

అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేతలు… తీరా గెలిచాక డబ్బు సంచులకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ తో కుమ్కకై అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని బండి సంజయ్ విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సిన 30 చోట్ల మజ్లిస్ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు తీరని అన్యాయం జరగబోతోంది. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడానికి సిద్దమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *