” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.”

సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ :9848559863
మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక, పండుగలు పబ్బాలు వదిలేసి ప్రజలను సురక్షితంగా తమ ఊళ్లకు చేర్చిన శ్రమజీవులు ఈ సంస్థ కార్మికులు. తమ జీవిత కాలమంతా సంస్థ ఎదుగుదలకు, ప్రజల రవాణా అవసరాలకు రక్తాన్ని, చెమటను ధారపోసిన ఈ విశ్రాంత ఉద్యోగుల శేష జీవితం నేడు అత్యంత చీకటిగా, దయనీయంగా మారింది. ఒకప్పుడు ప్రజా సేవకే తమ సుఖాలను త్యాగం చేసిన ఈ శ్రమజీవులు, వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాల్సిన సమయంలో తమ చట్టబద్ధమైన హక్కుల కోసం, నిలిచిపోయిన బకాయిల కోసం రోడ్లపైకి వచ్చి కన్నీరు కార్చాల్సి రావడం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి, అమానవీయతకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది. తమ సొంత కష్టార్జితం కోసం వృద్ధాప్యంలో ఇతరులను యాచించాల్సిన దుస్థితి కల్పించడం ప్రజాస్వామ్యానికే అవమానకరం.





