లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : “గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించాము అని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుండి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలాగా వ్యవహరించాము అని తెలుపుతూ ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది.కావున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం నాడు లేక విడుదల చేశారు. గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషిచేస్తాము. ప్రభుత్వం వైపు నుండి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నట్లు లేక లో పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నాము అని పేర్కొన్నారు.





