- దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే
- కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
- ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరుతో హైదరాబాద్ లోని సోమాజిగూడాలో ఆదివారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ ను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, పదేళ్ల పాటు నియంతృత్వ, కుటుంబపాలన సాగిస్తే, సాధ్యంకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దగా చేసిందని అన్నారు. 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారు.
కానీ ఈ ఏడాది కాలంలో మీరిచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతేడాది ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు. కానీ ఈ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మిగతా పార్టీల మాదిరిగా మేం భాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం లేదని ప్రభుత్వానికి ఏడాది కాలం పాటు గడువు ఇచ్చామని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన పనులతో పాటు ఏడాదిలోపు మొదలు పెడతామన్న పనుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ (%•శీఅస్త్రతీవ••%) ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వాటిని ప్రజల ముందు పెడుతున్నామన్నారు. గ్యారెంటీలు, డిక్లరేషన్ పేరుతో ఆయావర్గాలను నమ్మించిందో ఆ ఆంశాలపై తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేస్తున్నామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసలు, అరెస్టులు, లాఠీచార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ తో సమానంగా సీట్ల వచ్చాయని అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మాపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. రుణమాఫీ అసంపూర్ణంగా అమలైందన్నారు. రైతుభోరో పేరుతో తెలంగాణ రేతులకు వెన్నుపోటు పొడిచింది. పండించిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం వరికి మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు.
దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని కిషన్ రెడ్డి విమర్శించారు. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని చార్జిషీట్ లో దుయ్యబట్టారు. అప్పుడు కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ, ఇప్పుడు మూసీతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో కే-ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామాన్యానికి పాతరేస్తూ బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను గతంలో గుంజుకుంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందన్నారు.ధరణితో 10 లక్షల రైతుల భూములను బీఆర్ఎస్ మాయం చేస్తే, ఇప్పుడు హైడ్రా, ఫోర్త్ సిటీతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని విమర్శించారు. ఇక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచితే ఇప్పుడు ఏడాదిలోనే రూ. 80 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ చేసిందన్నారు. ఆడబిల్లలకు జీరో వడ్డికే రుణాలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే, స్కూటీ, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.