– 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచిన ప్రజలు
– వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూదిల్లీ, ఆగస్ట్ 27: దేశవ్యాప్తంగా జన్ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇది బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిదర్శనం అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. మొత్తం ఖాతాల్లో 78 శాతం గ్రాణ, నగర ప్రాంతాల్లో ఉండగా అందులో 56 శాతం మహిళల పేరిటే ఉండటం విశేషం. ఖాతాదారులకు ఇప్పటివరకూ 41.29 కోట్లకుపైగా రూపే డెబిట్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఖాతాల ద్వారా ఉచిత ప్రమాదబీమా, పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నారు. కనీస మొత్తం లేకుండానే రూ.10 వేల వరకు ఓవర్డ్రాప్ట్ సౌకర్యం, ముద్రా రుణాలు అందిస్తున్నారు. జన్ ధన్-ఆధార్- మొబైల్ అనుసంధానం ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ అవుతున్నాయి. 2014 ఆగస్టు 28న ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు సైతం బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి జన్ధన్ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేలా చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ ఖాతాల వల్ల ప్రజలు భద్రంగా డబ్బు పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం సులువు అవుతుంది. జన్ధన్ ఖాతాలను కనీస నిల్వ లేకుండానే నిర్వహించుకోవచ్చు.. కానీ చెక్కు సౌకర్యం కావాలంటే మాత్రం ఖాతాలో కనీస బ్యాలన్స్ తప్పనిసరి నిబంధన విధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





