‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’
స్పేయిన్ దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్ 23న ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తంచేసుకుంటూ.. మద్దతు తెలుపడానికి ఒకరికొకరు గులాబి పుష్పాలను అందించుకోవడం సంప్రదాయం.కాని 1926లో మిగ్యుల్ డి సెర్వెంటెస్ అనే ఆ (స్పేయిన్ )దేశ రచయిత మరణించడంతో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలను పరస్పరం అందించుకోవడం కీలకమైన .. ప్రపంచ వ్యాప్తంగా వివిద దేశాలు వేర్వేరు తేదీలలో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా1616 లో ఎప్రిల్ 23న సెవాంతెస్, షేక్స్ పియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే రచయితలు ఒకే రోజున మరణించడం. మరి కొందరు ప్రముఖ రచయితలు అదే రోజున జన్మించడాన్ని ప్రామాణికంగా తీసుకొనియునెస్కో 1995లో ప్యారిస్ లో జరిగిన సమావేశంలోపుస్తకాలకు మరియు రచయితలకు గౌరవ సమర్పణ చేయాలని, దీనికితోడు యువతరాన్ని చదువు వైపు ఆకర్షించడమే లక్యంగా… పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులవంటి విషయాలను ప్రోత్సాహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం ముఖ్యఉద్దేశంగాఎప్రిల్ 23న ‘‘ప్రపంచ పుస్తక దినోత్సవంగా’’ మరియు ‘ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
రచయితలు, ప్రచురణకర్తలు పాఠశాల ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది.అలాగే ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తూ వస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు పుస్తకం చదవడం ఒక ఉన్నతమైన అభిరుచిగా భావించాల్సిన అవసరముంది.కంప్యూటర్లు, టీ.వి.లు,ఇంటర్నెట్ ,సోషల్ మీడియా వంటివి పుస్తకానికి ప్రత్యామ్నయమైతే కావు. కాలేవు….పిల్లలకి,పెద్దలకు చదవడం ఒక అభిరుచిగానే కాదు ఒక అలవాటుగా మారాలి.పుస్తకం లేకుండ జ్ఞానం లేదు.ఎవరికి వారు తమ ఇష్టమైన రంగానికి సంబంధించిన పుస్తకాలయినా చదువాలి.వారానికి ఒక పుస్తకం చదివినా ఏడాదిలో 50కిపైగా పుస్తకాలు చదివినవారవుతారు.మన ఇంటిలో టి.వి, సోఫాలు,టేబుల్స్, ఫ్యాన్లు,ఏ.సి.లు కూలర్లు, కంప్యూటర్లు ఉండడమే కాదు పుస్తకాల కోసం ఒక రాక్ ని ఏర్పరుచుకోవాలి.ప్రతి ఒక్కరు తమకంటూ పర్సనల్ లైబ్రరిని ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది.
ఎవరు ఏ వృత్తి చేసినా ఏ రీతిన జీవించినా పుస్తకాలు చదవడంవలన వారి వికాసానికి, పురోభివృద్ధికి ఉపకరిస్తుంది. నిరంతరం చదవడం మనుషుల ఎదుగుదలకి, మనోవైశాల్యానికి తోడ్పడుతుంది.అందుకే పుస్తకాలు చదువడం మన జీవితంలో అంతర్భాగం కావాలి.పుస్తకాల పండుగలు ముఖ్యమైన పట్టణా లలోనే కాకుండా మారుమూల ప్రాంతాలలో కూడ నిర్వహించాలి. పుస్తకాలు అందరికి అందుబాటులోకి రావాలి. చదవాలనే జిజ్ఞాసను కల్పించాలి.ఒక కొత్త పుస్తకాన్ని కొని చదవడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. ఒక్కొక్క సారి ఒక ‘పుస్తకం’ మన జీవితాన్నే మార్చివేస్తుంది. ఒక్క వాక్యమే చాలు ఆలోచింపచేయడానికి, ప్రపంచంలో ఏ రంగలో శిఖరాగ్రస్థాయికి చేరుకున్నవారైనాపుస్తకాలు బాగా చదివి తమ జీవితాన్ని విశాలం చేసుకున్నవారే.
అందుకే చదువు మన బతుకులో భాగం కావాలి.పుస్తకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినపుడే అది సాధ్యమవుతుంది.‘కత్తికన్నా కలం పదునైనది’..ఇది మన సమాజం గర్వంగా చెప్పుకునే మాట.అయితే కత్తి కన్నా కలం గొప్పద వ్వాలన్నా, పదునుగా మారాలన్నా, కేవలం కలం పట్టిన కవి,రచయిత ఉంటే సరిపోడు.ఆ కలం సృష్టించే భావాలను అందుకునే పాఠకుడు కూడా సమవుజ్జీగా ఉన్నపుడే కలం సృష్టించే అక్షరాలు సమాజానికి ఆయుధాలుగా చేరుతాయి. కాబట్టి ఇక్కడ కీలకం చదువరులే.కానీ దురదృష్టవశాత్తుమన సమాజంలో పఠనాశక్తీ తగ్గిపోతుంది. పుస్తకాలు చదవడం అరుదవుతున్నది. పుస్తకమే జీవితంగా గడపాల్సినబాల్యంలో కూడ పుస్తకాల జోలికి పరిమితంగానే వెళ్లడం నేటి సమాజంలో కనిపిస్తున్న వాస్తవం. పుస్తకం అంటే క్లాసు పుస్తకమే అనే భావం విద్యార్థులలో బలపడేలా చేస్తుంది మన కార్పోరేట్ విద్యావ్యవస్థ.ర్యాంకులు, మార్కులు తప్ప ఇతర పుస్తకాలు చదవడం.. సమయాన్ని వృధాచేసుకోవడమే అనే భావన కల్పించడం వల్ల,క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదవడంఅంటే సమయాన్ని వృధా చేసుకోవడమనే భావన ఆటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులలోను నెలకొంది. ఒకప్పుడు ‘పుస్తకం హస్తభూషణంగా’ భావించిన మన సమాజంలో నేడు’సెల్ ఫోన్’ హస్త భూషణం అయింది.అలాగని సాంకేతిక ప్రగతిని అడ్డుకోవాలనో.. సాంకేతిక ప్రగతి ఫలాలను అనుభవించకూడదనో… అనడంలేదు.కాని కేవలం సాంకేతిక సామాగ్రి ఉంటే,మన చెంత సర్వస్వం ఉన్నట్లే అనే భావన సరైంది కాదు అని గుర్తిస్తే మంచిది.
పిల్లలకు పాఠ్యపుస్తకాలతో పాటు, సామాజిక పరిజ్ణానం,సాహిత్యం పట్ల అభిలాష,చారిత్రక నేపథ్యం పట్ల ఆసక్తిని పెంపొందించే రీతిన తల్లిదండ్రుల జీవనశైలి ఉండడం లేదు.చిన్నతనం నుండి పుస్తకాలను చదివించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ఇంటి నుండి బడి వరకు అందరూ విఫలమయ్యారనడంలో అతిశయోక్తి కాదు.లేదు .కంప్యూటర్ ముందు కూర్చోవడం ..సెల్ ఫోన్ లోతల మునకలవడం ..పిల్లల అభివృద్ధికి సూచికగా తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు. కానీ చిన్నప్పటి నుండే పుస్తకాలను చదివే అలవాటును చేస్తే వారి బతుకులు బాగుపడుతాయి. వారి జీవితాలూ వికసిస్తాయి. పుస్తకమూ జీవిస్తుంది. పాఠశాలలు, కళాశాలల్లో వివిధ సందర్భాలలో పిల్లలకు నిర్వహించే పోటీలు,ఇచ్చే బహుమతులకు వేలాది రూపాయలు ఖర్చు చేసే బదులుగా ఒక చిన్న పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చే అలవాటు చేస్తే పుస్తకం జీవిస్తుంది. పిల్లాడి జీవితం బాగుపడుతుంది.పుస్తకం కంటే నిఖార్సయిన మిత్రుడు,గైడ్ ఎవరుంటారు? పిల్లల కోసమే కాదు, పెద్దలకు కూడ పుస్తకాలు చదివే అలవాటు ఉండాలి.జీవితం అంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించడం విందు,వినోదాలలో మునిగి తేలడం మాత్రమే కాదు.హృదయానికి కొత్త అనుభవాన్నిచ్చే పుస్తకాల్ని చదువాలి.లోకం తీరును పట్టిచూపే పుస్తకాలతో సావాసం చేయాలి.
చదివే పుస్తకాలు కథలో, నవలలో కానక్కర్లేదు .ఆసక్తి ఉన్న ఏ రంగంలోని పరిణామాలను తెలుసుకోవడానికైన పుస్తకాలు చదవుకోవచ్చు. అందుకే అన్నారు. ‘పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది’అని …మనిషి సృజనాత్మకంగా జీవించాలంటే పుస్తకాలు ఉండాలి. అందుకుగాను పుస్తకాలు కొనాలి, చదువాలి. మన జీవన సంస్కృతిలో పుస్తకం విడదీయరాని భాగం కావాలి. అపుడే పుస్తకానికి భవిష్యత్తు ఉంటుంది.భవితకు వెలుగు దీపమై దారి చూపుతుంది.ఇంటర్నెట్, ఎస్.ఎమ్.ఎస్ యుగంలోకూడ పుస్తక స్థానాన్ని మరేది భర్తీ చేయలేదు.మనకుండే ఇతరేతర అభిరుచులు కూడా పుస్తక పఠనాన్ని క్షీణింపచేయజాలవు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకానికి ప్రత్యామ్నయమే లేదు. భావాల ఉద్రేకాల సంఘటనలు, భయంకర గందరగోళంలో నుంచి బయటపడేసేందుకు,స్నేహపూర్వకమైన సలహాలను ఇచ్చి మనల్ని మనం గౌరవించుకోవడం,పరులను గౌరవించడం నేర్పుతాయి.మన హృదయాన్ని,మేధస్సును మనిషి పట్ల,ప్రపంచంపట్ల ప్రేమతో నింపివేస్తాయి.అందుకే ‘పుస్తకం హస్తభూషణం కావాలి..

9989267462
(ఏప్రిల్’ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సంధర్భంగా…)