- 71 అడుగుల ప్రమాదకర స్థాయికి నీటిమట్టం
- వరద ముంపులోనే పలు కాలనీలు, గ్రామాలు
- డివిజన్లో అస్తవ్యస్తంగా జనజీవనం
- పునరావాస కేంద్రాలను తరలివెళ్తున్న ముంపుబాధితులు
- పరిస్థితిని సమీక్షించేందుకు నలుగురు ప్రత్యేక అధికార బృందం
- రక్షించేందుకు భదాద్రికి ఆర్మీ బృందాలు, వైద్య నిపుణులు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 15 : భద్రాచలంకు భారీ వరదనీటితో ముంచెత్తింది. ఎగువ ప్రాంతంనుండి వస్తున్న భారీ వరదలకు భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరింది. ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం పట్టణానికి భారీగా వరదముప్పు వాటిల్లింది. స్లూయీస్ పర్యవేక్షణ లోపం వలన స్లూయీస్ ద్వార పట్టణంలో ఉన్న కొత్తకాలనీ, అయ్యప్పకాలనీ, సుభాష్ నగర్ కాలనీల్లో వరద నీరు భారీగా వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. గురువారం 61 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం వలన సుమారు 9వేల మంది ప్రజలను వివిధ మండలాల్లో పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసారు. శుక్రవారం 71 అడుగులు చేరుకోవడంతో మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. అలాగే చర్ల, దుమ్ముగూడెంప్రాంతాలకు భారీగా వరదనీరు చేరుకుంది. అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి భారీగా వరదనీరు పోటెత్తింది.జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. పునరావాస కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు.
బూర్గంపాడు మండలం సారపాక వద్ద ఒక ప్రధాన రహదారి వరదనీటితో మునిగిపోయింది. రహదారి సౌకర్యం పూర్తిగా స్థంభించింది. అంతేకాకుండా ఐటిసి పేపర్ బోర్డ్ వద్ద రోడ్డుపైకి వరదనీరు చేరుకుంది. భద్రాచలం నుండి ఆ రహదారి ద్వారా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికి ఉన్న ఆ రోడ్డు కూడ వరదనీటితో మునిగింది. దీనితో కొత్తగూడెం వెళ్ళేందుకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అశ్వాపురం మారుమూల గ్రామాలు వరదనీటితో పూర్తిగా మునిగిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మారుమూల గిరిజన గ్రామాలు ముంపు ప్రాంతంలోనే మగ్గుతున్నాయి. మణుగూరు పట్టణం రామానుజవరం శివాలయాలు వరద చుట్టుముట్టింది. భదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు వరదనీరు పోటెత్తింది. పినపాక మండలం 3 గ్రామాలను చుట్టుముట్టి వరదనీరు చేరుకుంది. ఏడూళ్ళబయ్యారం పంచాయితీలోని రావిగూడెం, ఎస్సీ కాలనీ, తెలగబయ్యారంతో పాటు పాతరెడ్డిపాలెం గ్రామంలోని ఇండ్లకు వరదనీరు భారీగా చేరుకుంది. 1986 సంవత్సరంలో 75.6 అడుగులకు చేరుకుని రికార్డును సృష్టించింది. మళ్ళీ 2022 లో 71 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భదాద్రికి ఆర్మీ, ఎన్డిఆర్ బృందాలు
భద్రాచలం డివిజన్ వరద ముంపులో ఉన్న దృష్ట్యా ఎప్పటికప్పుడు ప్రజలను ముంపు ప్రాంతాలనుండి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు శుక్రవారం భారత ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ , సిఆర్పిఎఫ్ సిబ్బంది వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరదల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా 10 మంది వైద్య బృందం , 23 మంది ఇంజనీరింగ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొనేందుకు భద్రాచలం చేరుకున్నారు. వరదలను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్దంగా ఉన్నాయి. అలాగే లైఫ్ జాకెట్లు, కలిగి ఉన్నాయి. 210 మంది గజ ఈతగాళ్ళను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు.
భద్రాచలం డివిజన్కు మరో డిప్యూటి కలెక్టర్ల నియామకం
వరద తీవ్రతను బట్టి ప్రజలకు అందించాల్సిన సేవలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నలుగురు డిప్యూటి కలెక్టర్లను నియామకం చేసింది. భద్రాచలం డివిజన్లో ఈ అధికారులు పనిచేయనున్నారు. యంవి రవీంద్రనాద్, ఇ. వెంకటాచారి, కె. రాజేంద్రకుమార్, ఎల్ కిషోర్ కుమార్లను ప్రభుత్వం నియమించింది.
పరిస్థితిని సమీక్షిస్తున్న రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలం పట్టణంలోనే మకాం వేసి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు అందచేస్తున్నారు. వరదముంపుకు గురైన మండలాల్లో పర్యటిస్తూ భాధితులకు అందుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ పట్టణంలోనే మకాం వేసి పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు భోజన ఏర్పాట్లు గురించి అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలం బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసారు.
బాలింతలు వరదల నుండి బయటకు తీసుకొస్తున్న జడ్పిటిసి
వరదముంపుకు గురైన బాలింతను బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పసిపాపను ఎత్తుకుని వరదను దాటుతున్నారు. మండలంలో ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందుభాగంలో ఉన్నారు.