“సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి. సరళతరమైన సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్ క్యాడరైజేషన్లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి చేసి, ప్రమోషన్ల ద్వారా ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నా పర్యవేక్షణ పోస్టులను నింపడంద్వారా జవాబుదారితనం పెరిగి, ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠాశాలల్లో వసతులు కల్పించడంతో పాటు మానవ వనరులను కూడా పరిపుష్టం చేసినట్లయితే మొత్తంగా పాఠశాల విద్యావ్యవస్థ బాగుపడి ముఖ్యమంత్రి కలలుగంటున్న బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.”
ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం కళ్ళల్లో వత్తులేసుకొని దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. తమకు న్యాయంగా రావలసిన యం.ఇ.ఓ, డిప్యూటీ ఇ.ఓ, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు లాంటి ప్రమోషన్లు పొంది ఉన్నత పదవులు/ప్రమోషన్లలోకి వెళ్ళాల్సిన కొన్ని వేల మంది నియామకమైన క్యాడర్పోస్టుల్లోనే దు:ఖంతో రిటైరవుతున్నారు. డి.ఎస్.సిల ద్వారా నియామకాలు సకాలంలో జరుగకపోవడంవల్ల, పర్యవేక్షక పోస్టులకు ప్రమోషన్లు లేకపోవడంవల్ల విద్యావ్యవస్థ గాడితప్పి పతనస్థాయికి చేరుకుంది. భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే వ్యవస్థలైన డైట్, ఎస్.సి.ఇ.ఆర్.టి, సి.టి.ఇ లాంటి సంస్థలు 95% ఖాలీలతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల, బదిలీల ప్రక్రియను కొనసాగించడానికి గల అడ్డంకులు, సానుకూల అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు మేనేజ్మెంట్ల ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటికే ఒక దఫా చర్చలను ముగించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు ముగింపు పలకడానికి ప్రయత్నాలు ప్రారంభించడం ఒక శుభపరిణామం. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేవిధంగా ఆచరణ మరియు ఆమోదయోగ్యమైన విధానాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి గల మార్గాలతో ఒక రోడ్మ్యాప్ను రూపొందించడానికి అధికారులు తలమునకలై ఉన్నారు.
‘‘రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా 8 ప్రకారం ప్రొవిన్షలైజ్ అయిన తర్వాత పంచాయితీ రాజ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రస్తుతం లోకల్ కేడర్గా ఆర్గనైజ్ అయినా ఉపాధ్యాయులతో పాటు పంచాయతీ సమితి మరియు జిల్లా పరిషత్లలో పనిచేసే ఉపాధ్యాయులను ఇంటిగ్రేట్ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం కొరకు కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అటువంటి ప్రతిపాదనలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితిలో ఆమోదించాలి.’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30, 2015న వెలువరించిన తీర్పు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించడానికి పంపిన ప్రతిపాదనల ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి జిఎస్ఆర్ 637(ఇ), 639(ఇ) ఉత్తర్వులను కేంద్రం జారిచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా (3)లో మొదటి సవరణ ద్వారా ఉప పేరా 2(ఎ) చేర్చడం, 3వ షెడ్యూల్లో 23 (ఎ), 26 (ఎ), 26 (బి) మండల విద్యాధికారులు, ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ డైట్ లెక్చరర్లు, లెక్చరర్లు (డైట్)లను చేర్చుతూ వేరు వేరుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు రెండు సవరణలు చేయబడ్డాయి. 2 (ఎ) ప్రకారంగా ‘‘మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి జిల్లాలో గల నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల పోస్టులను ప్రత్యేక ఏకీకృత కేడర్గా ఆర్గనైజ్ చేయ•డాలి’’. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడంలో ప్రభుత్వం చేసిన తాత్సారంవల్ల పై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన సవాల్ మేరకు 371 (డి) ఆర్టికల్లో ఏకీకృతం అనే అంశం లేనందున రాష్ట్రపతి ఉత్తర్వులలోని 3వ పేరాలో చేర్చిన పేరా 2(ఎ)ను, 23 (ఎ)ను హైకోర్టు కొట్టి వేస్తూ సవరణలోని 26 (ఎ) మరియు 26(బి)ని కొనసాగించవచ్చునని పేర్కొంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే 2019లో 1819-1821ల ద్వారా స్పెషల్ లీవ్ పిటీషన్లు దాఖలు చేయగా సుప్రీంకోర్టు దీనిపై ఫిబ్రవరి 4, 2019న ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన స్టే ఇప్పటివరకు కొనసాగుతున్నది. ఈ స్టేను ఒక అవకాశంగా తీసుకొని ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసినా బాగుండేది లేదా తుది తీర్పుకోసం గట్టిగా ప్రయత్నంచేసినా బాగుండేది.
ఒకవైపు పాతకేసులు న్యాయస్థానాలలో పెండింగ్లో ఉండగానే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అప్పటి వరకు ఉన్న 10 జిల్లాలను మొదట 31 జిల్లాలుగా, తదుపరి 33 జిల్లాలుగా మరియు కొత్తగా 7 జోన్లను ఏర్పరిచి జిఎస్ఆర్ 524(ఇ), తేది:18.10.1975 రాష్ట్రపతి ఉత్తర్వులను సప్రెస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతి ఉత్తర్వులను 820(ఇ), తేది:29.08.2018 గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదముద్రను కేంద్రం నుండి పొంది అందుకనుగుణంగా జి.ఓ 124 ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులు పునర్నిర్వచించబడి 30.08.2018 నుండి రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలులోకివచ్చాయి. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టులో ఈ గెజిట్ నోటిఫికేషన్ లోని పేరా 3(3), 6(1)(ii) మరియు 8(1)(సి)లను ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ 346/2019, 1807/2019 లను దాఖలు చేశారు. తేదీ 04-01-2019 న హైకోర్టు ఇంటీరియం ఉత్తర్వులు ఇస్తూ చాలెంజ్ చేయబడిన అంశాలపైన తదుపరి చర్యలను తాత్కాలికంగా ఆపివేసింది. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో స్టే ఉన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వస్తూ ఉత్తర్వులపై స్టే వెకేట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం హై కోర్టులో దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇచ్చిన ఇంటిరియమ్ ఆర్డర్ను మాడిఫై చేస్తూ, ‘‘04-01-2019 తేదీన హైకోర్టు చే ఇవ్వబడిన ఉత్తర్వులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేసుకోకుండా మరియు అవసరమైన ప్రోసిడింగ్ జారీ చేయకుండా నిరోధించవు’’ అని తేదీ 05-02-2021 న ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకవైపు ఇదంతా జరుగుతున్న క్రమంలోనే 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను, మండల/జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను ఉత్తర్వు సంఖ్య 255, 256, 257 ద్వారా, అదేవిధంగా విద్యాశాఖలోని మండల విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు, డిప్యూటీ ఇ.ఓ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంటి పోస్టులను జి.ఓ 158 ద్వారా వేర్వేరుగా పి.ఓ-2018 ప్రకారంగా లోకల్ కేడర్లుగా వర్గీకరణ పూర్తిచేశారు. ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ నిర్వహణలోని పోస్టులన్ని ఒకేసారి లోకల్ కేడర్గా ఆర్గనైజ్ చేయబడడం ప్రభుత్వ, పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్రూల్స్ రూపొందించడానికి మొదటి అడుగుగా భావించవచ్చు. రాజ్యాంగంలోని 309 ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి రెండు కేడర్లను ఏకీకృతం చేస్తూ నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సెప్టెంబర్ 30, 2015 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే లోకల్ కేడర్గా వర్గీకరణ జరిగిన ఈ విషయాలన్నింటిని న్యాయస్థానాలకు నివేదించి అందులో పెండింగ్లో ఉన్న కేసులన్నింటిపై సానుకూల ఉత్తర్వులు పొందడం చాలా సులభమైన విషయం. కాని రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుకు అడుగులు వేయడానికి ఎందుకు సంశయిస్తున్నదో అర్థకావడంలేదు. కొంతమంది వితండవాదంతో 73, 74 పంచాయితీ రాజ్కు సంబంధించిన రాజ్యాంగ సవరణలు అడ్డంకిగా ఉన్నాయని ప్రస్తావిస్తున్నప్పటికి సుప్రీంకోర్టు 2015 సెప్టెంబర్లో ఇచ్చిన తీర్పులో ఈ విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.
ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామంటున్న బదిలీలు, ప్రమోషన్లను అనాలోచితంగా ప్రభుత్వం మేనేజ్మెంట్లవారీగా చేసినట్లయితే వెంటనే కొంతమంది ఈ విషయాన్ని సాకుగా చూపి కోర్టులను మళ్ళీ సంప్రదిస్తే శాశ్వతంగా ఏకీకృత సర్వీస్ రూల్స్కు పంచాయితీరాజ్ ఉపాధ్యాయులు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. గతంలో జిల్లా, జోన్లు అనబడే రెండంచెలుగా ఉన్న పాఠశాల విద్యావ్యవస్థ లోని పోస్టులు ఇప్పుడు మూడంచెలుగా అనగా జిల్లా, జోన్, మల్టీజోన్లుగా పునర్వ్యవస్థీకరించబడిన నేపథ్యంలో మళ్లీ మల్టీ జోన్ పరిధిలోని సర్వీస్ రూల్స్ను కూడా కొత్తగా రూపొందించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా వినబడుతున్న మరొక వాదన మండల విద్యాధికారులు, డిప్యూటీ ఇ.ఓ, డైట్ లెక్చరర్స్తో పాటు డిప్యూటీ ఐ.ఓ.ఎస్ పోస్టులు తమవేనని కాబట్టి తమకే ప్రమోషన్లు ఇవ్వాలని వాదిస్తున్నపటికి జి.ఓ 158 ద్వారా అవి లోకల్క్యాడరైజేషన్ అయ్యాయి కాబట్టి వారిది సమంజసవాదనకాదు. ఒకవేళ దీనినే ప్రతిబంధకంగా భావిస్తే ప్రభుత్వం అట్టి పోస్టులను రద్దు పరిచి కొత్త లోకల్ క్యాడర్లను ఏర్పరుచుకునే అధికారాన్ని వినియోగించుకొని, అధికారాలను విస్త•త పరిచి కొత్తగా యం.పి.ఇ.ఓ పోస్టులను, ఎడ్యుకేషన్ డివిజన్ ఆఫీసర్ లాంటి కొత్త క్యాడర్లను సృష్టించి ప్రమోషన్ల ద్వారా నింపే విధానాన్ని చేపట్టవచ్చు. రెండు మేనేజ్మెంట్లను కలుపడానికి వీలులేదని, రాజ్యాంగ విరుద్దమని వాదిస్తున్నవారి వాదన అర్థరహితమైనది. ఎందుకంటే 1992లోనే జిల్లా పరిషత్లో పనిచేసే ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్స్గా ప్రమోషన్ ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. అలాగే ఎయిడెడ్ మేనేజ్మెంట్లోని ఉపాధ్యాయులను కొంతమందిని ప్రభుత్వ మేనేజ్మెంట్లో, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో విలీనం చేసిన సందర్భం ఉంది.
రెవెన్యూ శాఖలో కొత్త సృష్టించిన పోస్టులను ఇతర శాఖలలో విలీనం చేసిన సందర్భాలో కోకొల్లలు. కాబట్టి మేనేజ్మెంట్ల ఏకీకృతం సాధ్యం కాదనే వాదన అర్థరహితమైనది. ఒకవేళ వారి వాదనను అంగీకరిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి వరకు మేనేజ్మెంట్ల వారీగా ప్రమోషన్లు కల్పించి, 158 జి.ఓలో పేర్కొనబడిన పోస్టులకు సంఖ్యా ప్రాతిపదికగా రెండు మేనేజ్మెంట్లకు రోస్టర్ను రూపొందించి ప్రమోషన్లు కల్పించే పద్దతిని కూడా పరిశీలించి ముందుకు వెళ్ళవచ్చు. 1969లో వచ్చిన పంచాయితీరాజ్ చట్టం ప్రకారంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని పంచాయితీరాజ్ పాఠశాలలుగా మార్చినట్లుగానే ఇప్పుడు పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని మున్సిపల్ పాఠశాలలుగా మార్చినట్లయితే అవి కూడా స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురాబడి ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పర్యవేక్షక పోస్టుల సంఖ్య పెంచినట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సమాధానపడి సహకరించే అవకాశం ఉంది.
తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా సహజన్యాయసూత్రాలకు వ్యతిరేకమైన, రాజ్యాంగ విరుద్దమైన ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలు ఇప్పటికే పంతాలతో పదే పదే కోర్టులకు వెళ్లి అటు ప్రభుత్వ విద్యావ్యవస్థను, ఇటు ఉపాధ్యాయులను బజారుపాలుచేసి ప్రైవేటీకరణ పాపంలో పాలుపంచుకున్నారు. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని సర్వీస్ రూల్స్ ఏకీకృతానికి సహకరించకపోతే వారిని ఏ చరిత్రా క్షమించదు. సాధ్యమేకాదనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి ఎన్నో చిక్కు సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యలో కూడా జోక్యం చేసుకొని ముగింపు పలకడానికి ఇదే మంచి అదనుగా భావించాలి. సరళతరమైన సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉండాలని పలుమార్లు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి నూతన లోకల్ క్యాడరైజేషన్లో భాగంగానే ఈ ప్రక్రియనంత పూర్తి చేసి, ప్రమోషన్ల ద్వారా ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నా పర్యవేక్షణ పోస్టులను నింపడంద్వారా జవాబుదారితనం పెరిగి, ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠాశాలల్లో వసతులు కల్పించడంతో పాటు మానవ వనరులను కూడా పరిపుష్టం చేసినట్లయితే మొత్తంగా పాఠశాల విద్యావ్యవస్థ బాగుపడి ముఖ్యమంత్రి కలలుగంటున్న బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.
– డా.ఏరుకొండ నరసింహుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU),
– రాజభాను చంద్రప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘంTSGHMA).