- గవర్నర్ను , సభను అవమానించిన ఘనుడు
- తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే
- కెసిఆర్కు ఇక రోజులు దగ్గర పడ్డాయి
- నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం
- తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్
- ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్
తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని… 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ను మింగిన చరిత్ర కేసీఆర్దని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను పీకేలు కాపాడలేరని… తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవమానిస్తోంది గవర్నర్ను కాదని.. శాసనసభ మర్యాదను అని తెలిపారు. సీఎం కేసీఆర్తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఈటల సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద బిజెపి రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టామని ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్లో తన లాంటి ఉద్యమకారుడిని, 20 ఏండ్ల పాటు తనతో పాటు నడిచిన వ్యక్తిని కుట్రపూరితంగా వెళ్లగొట్టి.. తన గొంతును పూర్తిగా నొక్కేయాలని సీఎం కేసీఆర్ యత్నించారని అన్నారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే బడ్జెట్పై తనతో చర్చకు రావాలన్నారు.
హరీష్ రావుది దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్ అని కాగ్ నిబేదిక చెప్పిందని తెలిపారు. తాగుడు వలన తెలంగాణలో భర్తలు లేని ఆడబిడ్డలు పెరిగిపోతున్నారన్నారు. కార్మిక సంఘాలను రద్దు చేయించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను కేసీఆర్ తొలగించాలన్నప్పుడు తాను అడ్డుపడ్డానని గుర్తుచేశారు. ఏడాదికి 90 రోజులు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను 30 రోజులకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దన్నారు. మానవ సంబం ధాలు తెలియని.. నైతికత లేని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రజలు, రాజ్యాంగం కల్పించిన అవకాశం తోనే తాను ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ నైతికత ఉంటే హుజురాబాద్ ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవారని తెలిపారు. కేసీఆర్ అహంకారాన్ని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన యుద్ధం హుజురాబాద్ ఎన్నికలని చెప్పారు. సభలో ఉద్యమకారుడు ఈటల లేకుండా ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ చేసిన మూర్ఖపు మాటలకు వ్యతిరేకంగానూ ఈ నిరసన చేపట్టా మన్నారు. ఈ దేశానికి, రాష్టాన్రికి శ్రీరామరక్షగా భావించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని అన్నారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సొమ్మును ఆరు నెలల పాటు హుజురాబాద్లో కుమ్మరించారని, పదుల సంఖ్యలో మంత్రులను అక్కడి దించి, మళ్లీ తన ముఖం అసెంబ్లీలో కనిపించ కుండా చేయాలని కుట్రలు పన్నినా సరే ప్రజలు బీజేపీకే ఓటు వేసి తనను గెలిపించారని అన్నారు.
హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించానని అన్నారు. కానీ కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని బయట పెట్టుకుంటూ రాజ్యాంగాన్నే రద్దు చేస్తానంటూ మాట్లాడారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనను చూడకూడదన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని, అందుకే సభ మొదలైన కొద్ది నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సెషన్ మొత్తం సెస్పెండ్ చేశారని ఈటల అన్నారు. రాష్ట్రంలో అనధికారికంగా కేసీఆర్ తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. తమ సస్పెన్షన్పై హైకోర్టుకు వెళ్తే.. న్యాయస్థానం సున్నితంగా స్పీకర్కు సూచన చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. సభా సాంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కి.. బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను అణచివేశారని ఈటల అన్నారు.
ఈ సమయంలో తమకు మిగిలింది ప్రజా క్షేత్రమేనని, ప్రజల తరఫున కొట్లాడుతామంటే కనీసం దీక్షలు, ధర్నాలకు కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన సంఘాలను కేసీఆర్ లేకుండా చేస్తున్నారని, సంఘాల ఉండొద్దంటే ఈ రోజు కేసీఆర్కు ఆ పదవి ఎక్కడిదని అన్నారు. కేసీఆర్కు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నారు.ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఆధ్వర్యంలో ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ముందుగా దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లటంతో… చివరికి అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సహా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర సీనియర్ నేతలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సెస్పెండ్ చేయడం, వారిని సభకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ సీరియస్గా తీసుకోకుండా తిరస్కరించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ దీక్ష చేపట్టింది.