సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటంచిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు శిక్షణ కోసం ఖర్చు పెట్టే పరిస్థితి లేదన్నారు.
మారుమూల గ్రామాల నుంచి శిక్షణ కోసం జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశం కాబట్టి ప్రతీ నియోజకవర్గంలో ఉచిత స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కోచింగ్ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యంతో పాటు ఉచితంగా రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. పార్టీల ద్వారా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ల ద్వారా అభ్యర్థుల్లో రాగధ్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ ద్వారానే నిరుద్యోగ శిక్షణ ఇవ్వాలనీ, ప్రతీ జిల్లా,నియోజకవర్గ కేంద్రాలలో గ్రాంథాలయాలను ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్ మెటీరియన్ను సైతం అభ్యర్థులకు ఉచితంగా అందజేయాలని ఈ సందర్భంగా సీఎంకు రాసిన లేఖలో బండి సంజయ్ కోరారు.