అధికారంలోకి వొచ్చాక వాళ్ల కరెంట్ బంద్ చేస్తాం
డబ్బా ఇండ్లు వొద్దన్న కెసిఆర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియ్యలేదు
వర్ధన్నపేట నియోజకవర్గం ప్రచారంలో పిపిసి చీఫ్ రేవంత్ రెడ్డి
కెసిఆర్ పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్ ఘన్పూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి
వర్థన్నపేట/స్టేషన్ ఘన్పూర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఖిలా వరంగల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం పూర్తి కాకముందే కూలిపోయిందని.మేడిగడ్డ కుంగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ వొస్తే కరెంట్ రాకపోవడం ఉండదని, అయితే రాదని ప్రచారం చేస్తున్న కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరెంట్ కట్ చేస్తానని ఘాటైన వ్యాఖలు చేశారు. పోలీసు బూట్లతో రైతులను తన్నించునోడు ఎమ్మెల్యేగా ఉన్నాడని అన్నాడు. తోడుక్కోవడానికి చెప్పుల్లేని ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించాడు. ఇసుక మీద బ్యారేజ్ కట్టి కుంగిపోయిందని చేప్పేటోళ్ళను ఎలా నమ్మాలని, తెలంగాణా విద్యార్థుల బలిదానాలతో నీళ్ళు, నిధులు నియామకాల పేరుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తన ఇంట్లో మాత్రం కొడుకును, అల్లుడిని బిడ్డను మంత్రులుగా చేసిండని, ఇంకా మనువడిని కూడా మంత్రిని చేయ్యాలని కేసీఆర్ చూస్తుండనీ చెప్పుకొచ్చారు.
ల్యాండ్ పూలింగ్ కింద భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేకు మీరే వోటు రూపంలో బుద్ది చేప్పాలన్నారు. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ ఇండ్లు ముద్దన్న కేసీఆర్ నియోజకవర్గం లో ఎక్కడ ఒక్క ఇల్లు కట్టించలేదని అన్నారు. వారికి మాత్రం వేయి ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని మండిపడ్డారు. టీవీలు, పేపర్లు పెట్టుకున్న కేసీఆర్ చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలేదని అన్నారు. ఆరూరి రమేష్ వరంగల్లో భూములు ఆక్రమించుకుని బిల్డింగ్లు కడితే వరంగల్ నగరం మునిగిందని,, కరెంట్ బిల్లు చూస్తే పేదలకు కరెంట్ షాక్ తగిలినంత పనైతుందని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచితంగా అందజేస్తామని, ప్రతి ఆడబిడ్డకు 2.500 నగదు, 500 కే గాస్ సిలిండర్, కౌలు రైతులకు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా కింద 15వేల నగదు, భూమి లేని నిరుపేదలకు 12వేలు, దళితులకు 200యూనిట్ల ఉచిత కరెంటు, ఉన్నత విద్య అభ్యసించే ప్రతి బిసి ఎస్సీ ఎస్టీ విద్యార్తులకు 5లక్షల బ్యాంక్ గారంటీ కార్డ్, ఆసరా ఫించన్లు 2వేల నుండి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వర్ధన్నపేటలో కేఅర్ నాగరాజును భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య,దొంతి మాధవ రెడ్డి,సాంబయ్య,నాయిని రాజేందర్ రెడ్డి,అబ్బిడి రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ పాపం పండింది…ప్రజలే బుద్ధి చెప్తారు : స్టేషన్ ఘన్పూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాపం పండిందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్టేషన్ ఘనపూర్ జెడ్పిటిసి మారపాక రవి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…గత పది సంవత్సరాల నుంచి కెసిఆర్ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరాలేదన్నారు. సీఎం కేసీఆర్ దొంగ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కెసిఆర్ పాపం పండిందని రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇవ్వడం జరిగిందని, అమెరికాలో బాత్రూములు కడిగి వొచ్చిన కేటీఆర్కు ఏం తెలుసు అన్నారు. సీఎం కేసీఆర్కు ఆడబిడ్డల మీద ప్రేమ లేదని కెసిఆర్ పాలనలో మహిళలను మంత్రి చెయ్యలేదని విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ నాయకులనే నమ్ముకునే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాడని, మద్యం అమ్మకాల్లో, రైతుల ఆత్మహత్యలు, అత్యాచారాలు, మాయ మాటలు చెప్పడంలో ముందున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. బడికి పోయే పిల్లగాండ్లకు కూడా బీరు సీసా చేతిలో పెడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులను చేయడం జరుగుతుందన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఊసరవెల్లి అన్నారు. సర్పంచులు అప్పులు చేసి మరి సర్పంచు పోటీలో గెలుపొందితే బీరు సీసాలు బతకాలని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యోగం రాక ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే ఓదార్చాల్సింది పోయి బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లను బజార్లో పడేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజయ్య నా.. కృష్ణయ్య నా.. తనకైతే తెలియదు కానీ కడియం శ్రీహరి స్వయంగా రాజయ్య చరిత్ర చెప్పడం జరిగిందన్నారు. రాజయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉండగా ఆడబిడ్డలు ఇంట్లో నుండి బయటకు రావడానికి భయపడుతున్నారన్నారు. కడియం శ్రీహరి, రాజయ్యలు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా వారి జాతకాలు గుణగుణాలు సీఎం కేసీఆర్కి తెలుసు కాబట్టి అర్ధాంతరంగా ఇంటికి పంపారన్నారు. వారు డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా కూడా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వంద పడకల హాస్పిటల్ తీసుకురాలేదన్నారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పిచ్చి కుక్కలా తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే మళ్లీ యువత అడవి బాట పట్టే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే జిల్లా నిర్మాణం కోసం ఐదు లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు ఎకరానికి 15000, కౌలు రైతులకు 15000, ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరానికి 12000, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడి ప్రజలను కోరారు.
రేవంత్ రెడ్డి అంటే కెసిఆర్ కు భయం : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఉన్నా కూడా అభివృద్ధి శూన్యంమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర. ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర కడియం శ్రీహరికి ఉందన్నారు. తనకు టికెట్ ఇవ్వడంతో సొంత పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కిడ్నాప్ చేయడం జరుగుతుందన్నారు. కడియం శ్రీహరి ఓడిపోతారని భయంతో పిచ్చికూతలు కూస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడే వారు కాదన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని ప్రతి గ్రామంలో పదులకు పైగా బెల్ట్ షాపులు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. దళితులను మోసం చేసిన చరిత్ర కెసిఆర్ కే దక్కుతుందని రానున్న ఎన్నికల్లో దళితుల కేసీఆర్ ను తరిమికొడతారన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కెసిఆర్ ఆస్తులను కక్కించి తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు.




