ఈ హత్యాకాండలో చేతులు కలపకండి!

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగలేఖ

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారూ,

మన రాష్ట్రానికీ ఛత్తీస్ గడ్ రాష్ట్రానికీ సరిహద్దులలో, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో, కర్రెగుట్టల ప్రాంతంలో ఇవాళ రేపట్లో ఒక భయానకమైన మారణకాండ జరగనున్నదని వార్తలు వస్తున్న పరిస్థితులలో, మీ తక్షణ స్పందన కోసం, తగిన చర్యల కోసం ఈ బహిరంగ లేఖ.

 

మనుషుల ప్రాణాలు కాపాడడం ఎవరికైనా ఉత్కృష్టమైన బాధ్యత. అందులోనూ ప్రభుత్వాధికారం ఉన్నవారికి అది రాజ్యాంగబద్ధమైన విధ్యుక్త ధర్మం. ప్రస్తుతం జరగనున్న మారణకాండ కేంద్ర ప్రభుత్వం పదహారు నెలల కింద ప్రారంభించిన ఆపరేషన్ కగార్ అనే అంతిమ యుద్ధంలో భాగం గనుక, మీరు, మీ పార్టీ అనేక విషయాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నారు గనుక ఈ మారణకాండకు మీరు సహకరించబోరని ఆశిస్తున్నాను. కళ్లముందర జరుగుతున్న హత్యాకాండలో చేతులు కలపకపోవడం, అధికారం, అవకాశం ఉంటే ఆ హత్యాకాండ జరగకుండా చూడడం ఎవరికైనా మానవీయమైన, సహజమైన కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మారణకాండలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు కలుపుతున్నదని, రాష్ట్ర పోలీసు బలగాలు, రాష్ట్రం వైపు నుంచి గ్రేహౌండ్స్ వంటి బలగాలు ముందుకు కదులుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర హోమ్ శాఖ కూడా మీ అధీనంలోనే ఉంది గనుక మన రాష్ట్రం వైపు నుంచి బలగాల కదలికలను తక్షణమే ఆపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ సందర్భంలో, ఈ హత్యాకాండ ఎందుకు జరుగుతున్నదో, దానిలో తెలంగాణ బిడ్డగా భాగం పంచుకోకపోవడం, దాన్ని అడ్డుకోవడం మీ బాధ్యత ఎలా అవుతుందో కొన్ని విషయాలు మీ దృష్టికి తేదలచాను.

 

ఆపరేషన్ కగార్ ప్రారంభం నుంచే ‘ఫలానా తేదీలోగా మావోయిస్టులను నిర్మూలిస్తాం’, ‘అంతం చేస్తాం’, ‘లేకుండా చేస్తాం’, ‘లేపేస్తాం’ అనే లక్ష్యాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారు. ఇలా కొన్ని సంస్థలను, ఆలోచనలను, కొందరు వ్యక్తులను చంపివేస్తాం అని హెచ్చరించడం అప్రజాస్వామికమైన వీథి రౌడీ ప్రలాపాల వ్యవహారమే తప్ప భిన్న ఆలోచనలకు, కార్యక్రమాలకు ఆస్కారం ఇచ్చే ప్రజాస్వామిక పద్ధతి కాదు. సంఘ్ పరివార్ భావజాలానికి చెందిన వ్యక్తిగా అమిత్ షా ఆ మాట అనవచ్చు గాని, ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, దానికి అనుగుణంగా, విధేయంగా పాలన జరుపుతానని, దాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసి హోమ్ మంత్రి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అనగూడని మాట అది. రాజ్యాంగం గురించి కేంద్ర హోమ్ మంత్రి మరిచిపోయినప్పటికీ, రాజ్యాంగ పరిరక్షణే తమ ధ్యేయమని అంటున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సారథ్యంలో పనిచేసే రాజకీయ నాయకుడిగా, రాజ్యాంగ మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిగా మీరు ఈ  ‘లేపేస్తాం, ముగిస్తాం, చంపేస్తాం’ భాషను ఆమోదించగలరా స్పష్టం చేయాలి.

కళ్లముందర జరుగుతున్న హత్యాకాండలో చేతులు కలపకపోవడం, అధికారం, అవకాశం ఉంటే ఆ హత్యాకాండ జరగకుండా చూడడం ఎవరికైనా మానవీయమైన, సహజమైన కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మారణకాండలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు కలుపుతున్నదని, రాష్ట్ర పోలీసు బలగాలు, రాష్ట్రం వైపు నుంచి గ్రేహౌండ్స్ వంటి బలగాలు ముందుకు కదులుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర హోమ్ శాఖ కూడా మీ అధీనంలోనే ఉంది గనుక మన రాష్ట్రం వైపు నుంచి బలగాల కదలికలను తక్షణమే ఆపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి, అధికరణం 21 ని ఒకసారి చూడండి. “చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా ఒక వ్యక్తి ప్రాణాన్నీ, భద్రతనూ రద్దు చేసే అధికారం” లేదని ఆ అధికరణం చెపుతుంది. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే ఎంత పెద్ద నేరానికైనా న్యాయస్థానాలలో విచారణ జరిపి, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో, సహేతుకమైన సందేహాలేవీ మిగలని స్థితిలో నేరం రుజువు చేసి, చట్టం నిర్దేశించిన శిక్ష విధించడం. కాని ఆపరేషన్ కగార్ కింద గత పదహారు నెలలలో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా కేంద్ర భద్రతా బలగాలు నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు తీశాయి. ఆ నాలుగువందలకు పైగా హతులలో సాయుధ మావోయిస్టులు మాత్రమే కాదు, నిరాయుధులైన ఆదివాసులు, ఆరు నెలల పసిపాప, మూగ చెవిటి యువతి, పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ కేంద్ర భద్రతా బలగాలు ఇప్పుడు మన రాష్ట్ర సరిహద్దులలోని కర్రెగుట్ట అడవి ప్రాంతంలో కొన్ని వందల ప్రాణాలు తీయడానికి మోహరించి ఉన్నాయి. అలా హత్యాకాండకు మోహరించిన కేంద్ర బలగాలకు మన రాష్ట్ర బలగాలు సహకరించడమంటే మీ ప్రభుత్వం కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడడమే అవుతుంది.

 

అంత మాత్రమే కాదు, రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితా ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. హోమ్ మంత్రిగా అది మీ బాధ్యత. ఇప్పుడు కేంద్ర బలగాలు మీ చేతి నుంచి ఆ అధికారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకం, రాష్ట్రాల హక్కులను కొల్లగొట్టడం, దేశపు సమాఖ్య స్వభావాన్ని ఉల్లంఘించడం. ఈ సందర్భంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ నేతగా మీ హక్కులను నిర్ధారించుకోవడం, కేంద్ర ప్రభుత్వపు అనవసర జోక్యాన్ని, దురాక్రమణ స్వభావాన్ని అడ్డుకోవడం మీ బాధ్యత. అది మీ ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.

కొందరు మనుషులను ప్రత్యర్థులు చుట్టుముట్టి, వారిని మొత్తంగా హత్య చేయాలనే దృఢనిశ్చయాన్ని ప్రకటిస్తున్నప్పుడు, చక్రబంధంలో ఉన్నవారు గత్యంతరం లేక ఎదురుదాడి చేయవచ్చునని తెలిసినప్పుడు, చూసేవారు మౌనంగా ఉండడం ఎంతమాత్రం మానవీయం కాదు. ఏదో ఒక ప్రయత్నం చేసి, ఆ దాడినీ ఎదురుదాడినీ ఆపవలసి ఉంటుంది. రక్తపాతం జరగకుండా, ప్రాణహాని జరగకుండా చూడవలసి ఉంటుంది. అటువంటి క్లిష్ట సమయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు ఎందుకు దాడి చేస్తున్నారు వంటి ప్రశ్నలు కూడా అవసరం లేదు. ‘ఇరువైపులా ప్రాణహాని వద్దు’ అనే ఏకైక ఆలోచనతో శాంతి ప్రయత్నాలు జరగాలి. మీరు అటువంటి ప్రయత్నం ప్రారంభిస్తే ఒక అర్థవంతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద ప్రారంభించిన అంతిమ యుద్ధంలో భాగంగానే ఈ దాడులు జరుపుతున్నానని అంటున్నది గాని, వాస్తవంగా ఈ దాడి ఆ ప్రాంతంలోని లక్షలాది మంది ఆదివాసుల మీద జరుగుతున్నది. నిన్నా ఇవాళా కర్రెగుట్టల మీద దాడి కూడా మావోయిస్టులమీద ఎక్కుపెట్టినట్టు పైకి చెపుతున్నారు గాని, అటు ఛత్తీస్ గడ్ ఆదివాసుల మీద, ఇటు సరిహద్దు ఇవతల మన రాష్ట్ర ఆదివాసుల మీద దాడిగా సాగుతున్నది. ఆదివాసుల రక్షణ గురించి మన రాజ్యాంగ నిర్ణయ సభలో జరిగిన చర్చ, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ఆదివాసులకు కల్పించిన ప్రత్యేక హక్కులు, అధికారాలు మీకు తెలుసు. ప్రస్తుత ఆపరేష కగార్ దాడి ఐదవ షెడ్యూల్ రక్షణలను కాలరాస్తున్నది. అలాగే పంచాయత్ ఎక్స్ టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం 1996, అటవీ హక్కుల చట్టం 2006 ఆదివాసుల జీవనానికి, భద్రతకు, సంస్కృతికి, రాజకీయాధికారానికి ఇచ్చిన రక్షణలను కూడా ఈ దాడి కాలరాస్తున్నది. ఆదివాసుల మీద కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ దాడిలో, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణ పాలు పంచుకోవడం మీ పార్టీ ప్రకటిస్తున్న ఆదర్శాలకు, వాగ్దానాలకు భంగకరం. ఆదివాసుల మీద సాగుతున్న దాడిని తీవ్రంగా వ్యతిరేకించడం, ఆ దాడిలో  పాల్గొనకుండా ఉండడం మీ బాధ్యత.

 

ఇంతకూ ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా సాగిస్తున్న ఈ దాడికి మూల కారణం కూడా మీ దృష్టికి తేవాలి. దండకారణ్యంగా పిలవబడే ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిలువలున్నాయి. ఈ ఖనిజ నిలువలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించే అభివృద్ధి నమూనాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తమ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ ల పరిరక్షణ కోసం ఆరాటపడుతున్న ఆదివాసులకూ ఈ అభివృద్ధి నమూనాకూ తీవ్రమైన ఘర్షణ సాగుతున్నది. ఆదివాసులకు మద్దతుగా నిలుస్తున్న మావోయిస్టులను నిర్మూలించి, ఆదివాసులను అక్కడి నుంచి వెళ్లగొట్టి, ఆ అడవినంతా కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వ ప్రయత్నం. ఈ విధంగా కార్పొరేట్లకు అనుకూలమైన, ప్రజా వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తామని మీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందర్భంగానూ, ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నోసార్లు ప్రకటించారు. ఇప్పుడు ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే లక్ష్యంతో సాగుతున్న ఆదివాసి హననంలో మీరు భాగం పంచుకోవడం, లేదా మౌనంగా ఉండడం పూర్తిగా అనుచితం.

 

ఖనిజాల దోపిడీ మాత్రమే కాదు, ఈ క్రమంలో అటవీ వనరుల విధ్వంసం, పర్యావరణ విధ్వంసం కూడా పెద్ద ఎత్తున జరగనున్నది. మన గోదావరి పరీవాహక ప్రాంతంలోని అరణ్యాలలో జరగనున్న ఈ గనుల తవ్వకాలు, పర్యావరణ విధ్వంసం మన రాష్ట్రం మీద కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు వేస్తాయి. ఒకవైపు మారణకాండ జరుపుతూనే ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ లో దాదాపు ఏడు వేల ఎకరాల అడవిలో నాలుగు ఇనుప ఖనిజం నిక్షేపాలను రెండు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించింది. మన పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పర్యావరణ విధ్వంస కార్యక్రమాలు, వాటికి తోడుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ హత్యాకాండను మన రాష్ట్రం తప్పనిసరిగా ఖండించవలసి ఉంది.

 

ఈ రాజ్యాంగ, రాజకీయ, ఆర్థిక, పర్యావరణ కోణాలు అలా ఉంచి, ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన కనీస మానవతా దృష్టికోణం కూడా ఉంది. కొందరు మనుషులను ప్రత్యర్థులు చుట్టుముట్టి, వారిని మొత్తంగా హత్య చేయాలనే దృఢనిశ్చయాన్ని ప్రకటిస్తున్నప్పుడు, చక్రబంధంలో ఉన్నవారు గత్యంతరం లేక ఎదురుదాడి చేయవచ్చునని తెలిసినప్పుడు, చూసేవారు మౌనంగా ఉండడం ఎంతమాత్రం మానవీయం కాదు. ఏదో ఒక ప్రయత్నం చేసి, ఆ దాడినీ ఎదురుదాడినీ ఆపవలసి ఉంటుంది. రక్తపాతం జరగకుండా, ప్రాణహాని జరగకుండా చూడవలసి ఉంటుంది. అటువంటి క్లిష్ట సమయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు ఎందుకు దాడి చేస్తున్నారు వంటి ప్రశ్నలు కూడా అవసరం లేదు. ‘ఇరువైపులా ప్రాణహాని వద్దు’ అనే ఏకైక ఆలోచనతో శాంతి ప్రయత్నాలు జరగాలి. మీరు అటువంటి ప్రయత్నం ప్రారంభిస్తే ఒక అర్థవంతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. ‘భారత రిపబ్లిక్ తన బిడ్డలను తానే చంపుకుంటుందా’ అని సుప్రీం కోర్టు 2011లో ఒక మావోయిస్టు నాయకుడి హత్య సందర్భంలో వేసిన ప్రశ్న మీరు వినే ఉంటారు. ఆ ప్రశ్న స్ఫూర్తిని కొనసాగించి, ముందుకు తీసుకుపోయి జన హననాన్ని ఆపే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతున్నాను. అందులోనూ కర్రెగుట్టలలో చిక్కుబడిన, కేంద్ర బలగాల నిర్విచక్షణ దాడిలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్న మావోయిస్టులలో, ఆదివాసులలో ఎందరో తెలంగాణ బిడ్డలు కూడా ఉండి ఉంటారు. వారిని కాపాడడానికైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు జోక్యం చేసుకోవలసి ఉంది.

దండకారణ్యంగా పిలవబడే ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిలువలున్నాయి. ఈ ఖనిజ నిలువలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించే అభివృద్ధి నమూనాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తమ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ ల పరిరక్షణ కోసం ఆరాటపడుతున్న ఆదివాసులకూ ఈ అభివృద్ధి నమూనాకూ తీవ్రమైన ఘర్షణ సాగుతున్నది. ఆదివాసులకు మద్దతుగా నిలుస్తున్న మావోయిస్టులను నిర్మూలించి, ఆదివాసులను అక్కడి నుంచి వెళ్లగొట్టి, ఆ అడవినంతా కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వ ప్రయత్నం. ఈ విధంగా కార్పొరేట్లకు అనుకూలమైన, ప్రజా వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తామని మీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందర్భంగానూ, ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నోసార్లు ప్రకటించారు. ఇప్పుడు ఖనిజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే లక్ష్యంతో సాగుతున్న ఆదివాసి హననంలో మీరు భాగం పంచుకోవడం, లేదా మౌనంగా ఉండడం పూర్తిగా అనుచితం.

ఈ సందర్భంలోనే ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనతో మన రాష్ట్రంలో జస్టిస్ చంద్ర కుమార్ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నం, శాంతి చర్చల కమిటీ ఏర్పాటు, దానికి స్పందిస్తూ మావోయిస్టు పార్టీ గడిచిన మూడు వారాలలో మూడు లేఖలు విడుదల చేయడం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని, సానుకూల వాతావరణం ఏర్పడితే శాంతి చర్చలకు కూడా సిద్ధమేనని మావోయిస్టు పార్టీ నాయకులు ప్రకటించారు. మన రాష్ట్రంలోనే (ఉమ్మడి రాష్ట్రంలో) కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల కింద ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ జరిగిన చరిత్రాత్మక చర్చల గురించి మీకు తెలుసు. ఇప్పుడు కూడా శాంతి చర్చల ప్రతిపాదనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని, ఉద్రిక్త, హింసాయుత వాతావరణంలో మార్పు తేవాలని, ప్రాణ నష్టాన్ని ఆపాలని భారత్ బచావో జరిపిన సభ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది.

 

ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ బలగాలను దాడికి దిగకుండా తక్షణమే నిరోధించడం, కర్రెగుట్టలలో తెలంగాణ సరిహద్దు లోపల ఎవరైనా మావోయిస్టులు ఉంటే వారిపై కాల్పులు జరిపి చంపివేయకుండా (వారు ఇప్పటికే ఒకటికి రెండు సార్లు తాము కాల్పుల విరమణ పాటిస్తామని అన్నారు గనుక అటు నుంచి కాల్పులు ఉండకపోవచ్చు) అరెస్టు చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం, శాంతి చర్చలకు తలుపులు తెరవడం ప్రభుత్వాధినేతగా మీరు చేయగలిగిన, చేయవలసిన పనులు. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద నిరంతరం విమర్శతో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, మీరు విద్యార్థి దశలో సంఘ్ పరివార్ విద్యార్థి సంస్థలో ఉండినందువల్ల, మీ అధిష్టానానికన్న భిన్నంగా కేంద్ర ప్రభుత్వంతో మెత్తగా ఉంటున్నారని ఒక అపోహ మీ మీద ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ కీలక సమస్యలో మీ జోక్యం, మీ సానుకూల వైఖరి ఆ అపోహను కూడా తొలగించగలుగుతుంది.

తక్షణమే ఈ విషయాలు ఆలోచించాలని, సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page