- ప్రజల కోసం పరితపించే పెద్ద మనసు ఆయన సొంతం
– నిరంతరం పేదల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి
– మిడ్జిల్ సభలో సీఎం రేవంత్పై భట్టి ప్రశంసలు
నాగర్క్నూలు, ప్రజాతంత్ర, జూలై 4: తనను ఆదరించిన ప్రజల దీవన పొందాలని, వారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిది పెద్ద మనసని డిప్యూటి సిఎం భట్టి విక్రామర్క అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన, పేదలను ఆదుకోవాలన్న ఆకాంక్ష రేవంత్ రెడ్డిలో ఉన్నాయని అన్నారు. రేవంత్ను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయనలో ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం తనను జడ్పీటీసీగా దీవించిన ఈ ప్రాంత ప్రజల చెంతకు, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి రావడం రేవంత్ రెడ్డి ఉన్నతమైన సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. కేవలం అధికారుల సలహాలకే పరిమితం కాకుండా, పేదోడి కష్టాలు స్వయంగా తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రజాపాలన అందిస్తున్నారని, ప్రకృతి కూడా ఆశీర్వదించేంత మంచి సంకల్పంతో ఆయన నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆకలి లేని సమాజమే లక్ష్యంగా కోటి పదిహేను లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, అలాగే 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో పౌష్టికాహారం అందించడం ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతోందని భట్టి విక్రమార్క వివరించారు. నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అక్కాచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ప్రజా సంక్షేమమే అజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పాలకుల హయాంలో నిరంతరం భయంతో బతికిన తెలంగాణ ప్రజలకు, నేడు నిజమైన స్వేచ్ఛా స్వతంత్ర జీవనాన్ని ప్రసాదించిన ధీశాలి రేవంత్ రెడ్డి అని డిప్యూటీ సీఎం కొనియాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





