– మధుమేహం మనసునూ ప్రభావితం చేస్తుంది
– మానసిక ఒత్తిడికి కారణం
– సరైన సంరక్షణతో అదుపులో డయాబెటిస్
– 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం
– నెల రోజులపాటు కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: హైదరాబాద్ వ్యాప్తంగా నెల రోజులపాటు కేర్ హాస్పిటల్స్ యాజమాన్యం డయాబెటిస్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, నివారించడం, తగిన సంరక్షణ తీసుకోవడం, అలాగే మధుమేహం వల్ల కలిగే సమస్యలు ముఖ్యంగా డయాబెటిక్ పాదం వంటి తీవ్రమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. డయాబెటిస్ కేవలం శరీరాన్నే కాదు, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక శారీరక వ్యాధి మాత్రమే కాదు, భావోద్వేగంగా, మానసికంగా కూడా పెద్ద ఒత్తిడిని కలిగిస్తుంది. డయాబెటిస్తో జీవిస్తున్న ప్రతి పదిమందిలో ఏడుగురు ఉద్యోగ వయసులో ఉన్నవారే. అంటే ఈ వ్యాధి పనితీరు, ఉత్పాదకత, మొత్తం ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన 2025 ప్రపంచ మధుమేహ దినోత్సవ థీమ్ “జీవిత దశలలో మధుమేహం”. ఈ థీమ్ ప్రతి దశలోనూ సమగ్ర సంరక్షణ, జీవితాంతం మద్దతు అవసరాన్ని గుర్తు చేస్తుంది. కేర్ హాస్పిటల్స్ ఈ దార్శనికతను అనుసరిస్తూ కమ్యూనిటీ ఆధారిత అవగాహన, నివారణ, సకాలంలో జోక్యంపై దృష్టి సారిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నివాస ప్రాంతాలు, ఐటీ పార్కులు, మాల్స్లలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ శిబిరాలు, ఉద్యోగుల కోసం “మీ చక్కెరను తెలుసుకోండి” కార్యాలయ అవగాహన కార్యక్రమాలు, అలాగే పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు “ఆరోగ్యకరమైన టిఫిన్” పాఠశాల సెషన్లు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు మధుమేహంపై ప్రజల్లో సమగ్ర అవగాహనను పెంపొందించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు దారితీస్తాయి.
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ విడుదల చేసిన డయాబెటిస్ అట్లాస్ 2025 నివేదిక ప్రకారం మధుమేహం ఉన్నవారిలో 19 నుంచి 34 శాతం మంది తమ జీవితంలో ఏదో దశలో పాదాల పుండుతో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. సకాలంలో సరైన సంరక్షణ తీసుకోకపోతే, ఈ పుండ్లు ఇన్ఫెక్షన్కి దారితీసి విచ్ఛేదన వరకు చేరే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పెరుగుతున్న ఆందోళనపై దృష్టి సారిస్తూ కేర్ హాస్పిటల్స్ వాస్కులర్ఎం, డోవాస్కులర్ సర్జరీ & వాస్కులర్ ఐఆర్ విభాగం క్లినికల్ డైరెక్టర్, భాగాధిపతి డాక్టర్ పి.సి.గుప్తా మాట్లాడుతూ డయాబెటిక్ పాదం అనేది డయాబెటిస్ వల్ల వచ్చే అత్యంత నిర్లక్ష్యానికి గురైన, ప్రమాదకరమైన సమస్యల్లో ఒకటన్నారు. ఇది మొదట తిమ్మిరి, చిన్న గాయాలు లేదా రక్తప్రసరణ తగ్గడం వంటి లక్షణాలతో నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది త్వరగా ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్, అవయవ నష్టం వరకు దారితీస్తుంది. రోగులను ముందుగానే పరీక్షించి సరైన చికిత్స అందిస్తే, ఈ సమస్యలలో చాలా వరకు పూర్తిగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. డయాబెటిస్ ఉన్న రోగులలో కూడా పాదాల సమస్యలపై అవగాహన తగినంతగా లేదని డాక్టర్ గుప్తా అన్నారు. చాలామంది జలదరింపు, తిమ్మిరి లేదా పాదాల్లో చిన్న గాయాలు వచ్చినా వాటిని లెక్కచేయరని చెప్పారు. ఇందుకోసం బహుళ విభాగాల పాద సంరక్షణ క్లినిక్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు రోజూ పాదాలు తనిఖీ చేసే అలవాటు కల్పించడం అవసరమన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న పాదాలను ముందుగానే గుర్తించి చికిత్స చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. డయాబెటిస్ కేవలం శారీరక వ్యాధి కాదు.. ఇది కుటుంబాలు, ఉద్యోగ స్థలాలు, సమాజాన్ని సైతం ప్రభావితం చేసే మానసిక–సామాజిక సవాలుగా మారింది. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ డయాబెటిస్ అనేది ఒక్క వైద్య సమస్య కాదు.. జీవితాంతం అవగాహనతో, జీవనశైలిలో మార్పులతో ఎదుర్కోవాల్సిన సవాలు. విద్య, ముందస్తు స్క్రీనింగ్లు, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలను నివారించడం ద్వారా ప్రజలను మరింత జాగ్రత్తగా, శక్తివంతంగా మార్చడమే మా లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రచారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025 థీమ్ ‘జీవిత దశలలో మధుమేహం’ కు అనుగుణంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి మధుమేహంపై అవగాహన, నివారణ, సమగ్ర మధుమేహ సంరక్షణ అందించడంలో కేర్ హాస్పిటల్స్ కట్టుబాటును మరోసారి తెలియజేస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





