– గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
– ఆలయ మాస్టర్ ప్లాన్ రివ్యూ సమావేశం
– పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పై కొండా సురేఖ రివ్యూ సమావేశం సోమవారం నిర్వహించగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంటు డైరెక్టర్ హరీష్, డిపార్టుమెంటు ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వందలాది సంవత్సరాల చరిత్ర గల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్ కు అవసరమైన స్థల సేకరణ వివరాలు మంత్రి, అధికారులను అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నారు. స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం రూ. 50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ది పరుస్తున్న మంత్రి కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత పని ఒత్తిడిలోనూ తమ టెంపుల్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి అభివృద్ధి పనులపై మార్గదర్శనం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ టెంపుల్ కోసం అయ్యే స్థల సేకరణకి సంబంధించిన అంశాల్లో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని హామీనిచ్చారు. అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు కూడా విజయవంతంగా చేస్తామని హామీనిస్తున్నట్టు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి రూ.50కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రధాన దేవాలయ విస్తరణ, వైకుంఠ ద్వార నిర్మాణం, క్యూలైన్ కాంప్లెక్స్, టిన్ షెడ్స్, వ్రత మండప నిర్మాణం, కాలక్షేప మండపం, ప్రసాదం కౌంటర్ల, నిత్య కళ్యాణ మండప నిర్మాణం, మహా ప్రాకార, రథశాల, పెద్ద డార్మిటరీ హాల్స్, డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ నిర్మాణం వంటివి ఉన్నాయి. అలాగే సులభ్ కాంప్లెక్స్, షవర్స్, జలప్రసాదం వసతి, మండప నిర్మాణం, నిత్యాన్నదాన భవనం, శ్రీ యోగనృసింహస్వామి (ప్రధాన దేవాలయం) ఆలయం పునర్నిర్మాణం , శ్రీ యమధర్మరాజు దేవాలయం పునర్నిర్మాణం తదితర అంశాలకు ఆమోదం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





