– మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి
మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 14: మహిళల సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది అని, సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు. మంగళవారం ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ పరిధిలోని ఎస్.హెచ్.జీ మహిళల కోసం నాగోల్ లో మంగళవారం వైభవంగా జరిగిన ‘మీ సురక్ష – సహచరి’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తమ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం తెలంగాణ పోలీసింగ్కు సరికొత్త దిశానిర్దేశం చేస్తోందని, ఇది ఒక విప్లవాత్మక కార్యక్రమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలు (ఎస్.హెచ్.జీ ) మహిళలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడాన్ని పోలీస్ కమ్యూనిటీ లక్ష్యంగా పెట్టుకుందని.. మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన స్తంభాలపై రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం, పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు మహిళల్లో భద్రతా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పోలీస్ శాఖ, స్థానిక సమాజం కలిసి పనిచేసే సమగ్ర నమూనాగా ‘సహచరి’ రూపొందింది. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కాదు… సమస్యలు తలెత్తకుండా ముందుగానే నివారించడం, బాధిత మహిళలకు అండగా నిలవడం, అవసరమైన చట్టపరమైన, మానసిక, సామాజిక సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతూ, చట్టాలపై అవగాహన కల్పించి, ప్రజల భాగస్వామ్యంతో భద్రమైన, సురక్షితమైన సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. మొదటి దశలో 3,195 మంది సహాయక సంఘాల మహిళలకు శిక్షణ అందించి, వారి ద్వారా 2.70 లక్షల మహిళల్లో మహిళా భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ “మీ సురక్ష – సహచరి” ద్వారా ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తిని అందించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. మొదటి దశలో వేలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దనున్నామని, మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన మరియు రోడ్డు భద్రతపై వీరికి ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, సెర్ప్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయని సీపీ చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు కమిషనరేట్ పరిధిలో ఎస్.హెచ్.జీ మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం ద్వారా నేర నిరోధంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పోలీస్-కమ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడం, సురక్షితమైన సమాజ నిర్మాణానికి తోడ్పడడం ప్రధాన లక్ష్యమన్నారు. సామాజిక భద్రతా అంబాసిడర్లు తమ పరిధిలోని ఎన్.హెచ్.ఓలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నేరాలను సకాలంలో పోలీసులకు తెలియజేసేలా ప్రజలను ప్రోత్సహించడం, గ్రామీణ స్థాయిలో పోలీస్-కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం వంటి బాధ్యతలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొనే మహిళలు పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కేంద్రాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను సందర్శించి పోలీస్ సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతోపాటు ఆయా సంస్థల పనితీరును తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, డిసిపి లక్ష్మి, ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య, నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ, ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





