– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై ఎందుకు చర్యలు తీసుకోరు?
– ప్రతిపక్ష నాయకుడి ఇంటిమీదికి దండయాత్రా
– అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి
– టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదు.. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప చావు కోరుకోవడం విచిత్రంగా వుందన్నారు. అంటే ఆయన దూషణలను కాంగ్రెస్ సమర్థిస్తుందా? ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటీ? ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ఉసిగొల్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తోందని ఆ ప్రకటనలో ప్రశ్నించారు. ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు అందక విద్యార్థులు, 22ఏ నిషేధిత భూముల జాబితాలో తమ భూములు నమోదు అయి రైతులు, ప్రజలు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు, యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వరుసగా జరుగుతోన్న అఘాయిత్యాలు, హత్యాచారాలతో భయం భయంగా మహిళలు కాలం గడుపుతున్నారు. నాణ్యమైన భోజనం, వసతులు లేక గురుకులాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు సహా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉంటే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు రోజులుగా విలువైన సభా సమయాన్ని వృథా చేశాయి, రేపటి నుంచి అయినా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి.. వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కవిత కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




