- రైతులకు సమృద్ధిగా సాగునీరందిస్తాం..
- సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
- దేవాదుల పంపు హౌస్ పనులపై సమీక్ష
హనుమకొండ, ప్రజాతంత్ర, మే 3 : దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని దశలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపు హౌస్ స్టేషన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా దేవన్నపేటలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద మంత్రులు దిగగా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పుష్పగుచ్చాలను అందజేశారు.
దేవాదుల పంపు హౌజ్ స్టేషన్ చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టన్నెల్ ను పరిశీలించారు. అనంతరం దేవాదుల పంపు హౌజ్ పనుల పురోగతి, ఇతర అంశాలపై సాగునీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇందులో భాగంగానే దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీరు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వొచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదుల మూడు పైపు లైన్ల పంపులను ఆన్ చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాదుల పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్, సీఈ అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.