– ప్రపంచ శాంతి, స్థిరత్వమే మా విధానం
– భద్రతకు ముప్పు వాటిల్లినందునే ఆపరేషన్ సిందూర్
– అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం
– కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ
విశాఖపట్నం, జూలై 11: భారత్ లక్ష్యం యుద్ధం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వమే తమ విధానమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదని, భారత భద్రతకు ముప్పు వాటిల్లితే దేశం ఎలా స్పందిస్తుందో ప్రపంచానికి చూపించిన చర్య అని వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, భారత్ వ్యతిరేక శక్తులకు అవసరమైన సమయంలో తగిన సమాధానం ఇస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరడం దేశ భద్రతకు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన ఆయన.. ఇది భారత నౌకాదళ శక్తిని మరింత పెంచే కీలక అడుగని పేర్కొన్నారు. భారత సముద్ర భద్రతలో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదిగిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసించారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అత్యాధునిక సాంకేతికతపై దృష్టి సారించామని తెలిపారు. ఐదో తరం ఎయిర్క్రాప్ట్ క్యారియర్ టెక్నాలజీతో పాటు అండర్వాటర్ టార్పెడో వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కర్నూలును దేశంలో ప్రముఖ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ షిప్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, పూర్తి స్థాయి నిఘా వ్యవస్థలతో భారత సాయుధ దళాలను ఆధునికీకరిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కొత్త సాంకేతికత యుద్ధ అవసరాలకే కాకుండా విపత్తుల సమయంలో ఇతర దేశాలకు సహాయం చేయడంలో కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మారిటైమ్ విజన్-2030 అమలులో భాగంగా సముద్ర రంగ అభివృద్ధికి ప్రత్యేక మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. షిప్బిల్డింగ్ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని, భారత్ను ప్రపంచ స్థాయి షిప్బిల్డింగ్, మెరిటైమ్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి మెరిటైమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్తులో యుద్దాలు కృత్రిమ మేధతో జరుగుతాయని, కానీ దేశం పట్ల ప్రేమ, సుక్షితులైన సైనికులు, సమర్థవంతమైన సైనిక సత్తా ఉంటే యుద్దాలను గెలవవచ్చు అని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తిలో ఆంధప్రదేశ్ కొత్త శక్తికేంద్రంగా మారినట్లు ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీలు, సంప్రదాయ విధానాలు ఒకటికి ఒకటి వేరు కాదు అని, ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయని, పోటీపడుతాయని, సంప్రదాయ ఎ•-లాట్ఫామ్లు లేకుండా.. కొత్త టెక్నాలజీ అసంపూర్ణంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుద్ధనౌకలోని 75 శాతానికి పైగా భాగాలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు.భారతదేశ రూపకల్పన సామర్థ్యం, తయారీ నైపుణ్యం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం, అలాగే దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ శక్తికి ఇది సజీవ నిదర్శనమని మంత్రి రాజ్నాథ్ అన్నారు. మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లో ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నిర్మించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉందని అధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





