– భారత్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం
– పాక్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు
ఇస్లామాబాద్, జూన్ 22: సింధు జలాల కోసం అవసరమైతే భారత్తో యుద్దం చేస్తామని పాక్ ప్రగల్భాలు పలికింది. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్యలు తమ నీటి సరఫరాకు ముప్పు కలిగిస్తున్నాయని, అవసరమైతే ఆ దేశంపై యుద్దానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి పూర్తిగా, విశ్వసనీయంగా అడ్డుకట్ట వేయకపోతే ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. పాకిస్థాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని ఆసిఫ్ అన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని ఆసిఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలనూ ఉపయోగిస్తామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆసిఫ్ హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను భారత్, పాకిస్థాన్కు సమానంగా కేటాయించారు. ఒప్పందం ప్రకారం రావి, బియాస్, స్లటెజ్ నదులపై భారత్కు హక్కులు ఉంటాయి. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్కు హక్కులుంటాయి. అలాగే పాకిస్థాన్కు కేటాయించిన మూడు నదులపై కూడా భారత్కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. పాక్కు కేటాయించిన నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. తాగునీరు, గృహ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చు. పరిమిత స్థాయిలో సాగునీటికి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే నదుల ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునే హక్కు భారత్కు లేదు. కాగా, ఇటీవలి ఉగ్రవాద ఘటనల తర్వాత భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో చీనాబ్, జీలం నదులపై కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




