రబీకి యూరియా రెడీ

– ఈ సీజ‌న్‌కు కొరత లేదు
– 2.48 లక్షల టన్నుల స్టాక్ సిద్ధం
– కేంద్రం నుంచి అదనపు సరఫరా
– త్వరలో రవాణాకు అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు యూరియా నిల్వలను పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి భారీగా యూరియా స్టాక్ చేరుతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిల్లో ప్రారంభమయ్యే రబీ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి యూరియా కొరత రాకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో యూరియా లభించక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈసారి ముందుగానే నిల్వ లను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తుమ్మల పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఈ నిల్వలను మరింత పెంచేలా చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. డిసెంబర్ నెల వరకు అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వివరించారు. డిసెంబర్కు కేటాయించిన 86 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తూత్తుకుడి, గంగవరం, కారైకల్, జైగఢ్ వంటి వివిధ ఓడరేవులకు చేరుకుందని తెలిపారు. ఈ యూరియాను వేగంగా తెలంగాణకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు లేఖలు రాసినట్లు మంత్రి వెల్లడించారు. యూరియా రవాణా ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యూరియా తరలింపునకు అవసరమైన ఖాళీ రైల్వే రేక్లను తక్షణమే కేటాయించాలని రైల్వేశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే పోర్టుల్లో క్లియరెన్స్, హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని, ఇతర సరుకుల కంటే యూరియా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని మంత్రి సూచించారు. ఈ మొత్తం రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కూడా ఓడరేవులకు పంపినట్లు ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page