– డయ్యూ డమన్లో రిజస్ట్రేషన్..ఆల్టరేషన్
– సీటింగ్ బస్సు స్లీపర్ బస్సుగా మార్పు
– తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ దందా
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ అక్రమ బాగోతం తేటతెల్లం అయ్యింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్ క్యారీయరే కానీ స్లీపర్ సర్వీస్ కాదని తేలింది. వేమూరి కావేరి ట్రావెల్స్ పేరిట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విశాఖపట్నం రూట్లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కమార్ ఈ బస్సును కొనుగోలు చేసి తీసుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరి సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరి ట్రావెల్స్ .. ఒడిశాలోని రాయగడలో అల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించుకున్నారు. రాయగడ అధికారులు అల్ట్రేషన్, ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారీయర్గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూ డామన్లో సీటింగ్ సామర్ధ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు రూ.450 మాత్రమే అదే స్లీపర్ సీటు అయితే రూ.800 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు రూ.4500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకు అయితే రూ.12వేల చొప్పును ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్లను ఎగవేసేందుకే వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్ట్రేషన్ చేయించింది.
కావేరి బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు
ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. తొమ్మిదిసార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు పడినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సు 9490 నంబరుతో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ వెల్లడించింది. ఈ బస్సు ఫిట్గానే ఉందని, బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని తెలిపింది. ‘కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్టేష్రన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం అని రవాణా శాఖ పేర్కొంది. అయితే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాన్యం ఇంకా స్పందించిక పోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





