– నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి
– వర్షాకాల సన్నద్ధతపై డీజీపీ ఆనంద్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, నగర వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. మల్కం చెరువు, ఖాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాలు, కొండాపూర్, ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలు నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానాలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నాయి. అదేవిధంగా తక్షణ చర్యలు అవసరమైన అంశాలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాలపై నివేదికలను సమర్పించనున్నట్లు తెలిపారు. పోలీస్, ఇరిగేషన్, జీహెచఎంసీ, హైడ్రా, ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా అలసత్వం లేదా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎలాంటి లోటు ఉండకూడదని డీజీపీ ఆదేశించారు. నీటి నిల్వలు, వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రత, సౌకర్యాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాయని సమావేశంలో పునరుద్ఘాటించారు. సమావేశంలో జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఇరిగేషన్, హైడ్రా, జీహెచఎంసీ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





