నూగూరు వెంకటాపురం ప్రజాతంత్ర 8 : కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ తో అరణ్యం నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో వేలాది మంది కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపడుతూన్నాయి. తెలంగాణ సరిహద్దు దట్టమైన అడవిలో గురువారం తెల్లవారుజామున ల్యాండ్ మైన్ పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కు చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. లంకపల్లి అటవీ ప్రాంతంలోకి రాగానే మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చివేయడంతో కూంబింగ్ కు వొచ్చిన ముగ్గురు పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట, సిద్ధిపేట సందీప్, పవన్, రణధీర్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.