కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే ఘనత బిజెపికే ఉందని స్పష్టమైన సంకేతం తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన, బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వొచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నం చేశారు. యూపీఏ హయాంలో దేశంలో అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు, మతకలహాలు, ఉగ్రవాద సంబంధిత కార్యక్రమాలు జరిగేవి. హైదరాబాద్ నగరంలోని లుంబినీ పార్కులో, కోఠిలోని గోకుల్ చాట్ లో, ఎల్బీనగర్ లో కూడా బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక టెర్రరిజంపై “జీరో టోలరెన్స్” విధానాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోంది. 2019లో ఆర్టికల్ 317 తొలగించిన తర్వాత జమ్ము కశ్మీర్ లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు తగ్గాయి. శాంతి సామరస్యం ఏర్పడింది. అయితే ఇది పాకిస్థాన్ కు కంటగింపుగా మారింది. జమ్ము కశ్మీర్ లో 75 ఏళ్ల తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోంది. భారతదేశంలో జమ్మూ కశ్మీర్ అంతర్భాగంగా ప్రపంచమంతా అంగీకరిస్తోంది.
అయితే, ఇది మన దేశంలోని కొన్ని అంతర్గత శక్తులకు ఇష్టం లేదు. జమ్మూ కశ్మీర్ మాదేనని మాట్లాడుతున్న పాకిస్తాన్ కు కూడా ఇష్టం లేదు. అందుకే, భారతదేశంలోని శాంతిని, సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్లోని అంతర్గత సమస్యలను ఎదుర్కోలేక, దేశ ప్రజలకు తిండి, ఉపాధి కల్పించలేక, దృష్టిని మరల్చడానికి జమ్మూ–కశ్మీర్లో మరోసారి బాంబుదాడులను ప్రేరేపించేందుకు కుట్రలు చేస్తున్నది. ఇటీవల పెహల్గామ్ లో అమాయక హిందువులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే.. అతి కిరాతకంగా ఉగ్రవాదులు కాల్చిచంపారు. భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు పెహల్గామ్ ఉగ్రవాద ఘటనను ఖండిస్తున్నాయి. ఉగ్రవాద దాడికి సంబంధించి బాధితులకు న్యాయం చేసేలా, దోషులను శిక్షించేలా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశ ప్రజలందరూ సంఘటితంగా నిలబడి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి స్పందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.