చూపు ఫోన్ పై కాదు, లక్ష్యం పై ఉండాలి

ఏ రోజు కూడా మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సివిల్స్ లో మంచి ర్యాంక్

 - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 9703935321
 – డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి  రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 9703935321

ఇటీవల భారత్ లో విడుదలైన సివిల్స్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తుల ఇంటర్వ్యూలను వార్తా పత్రికలలో చూసినపుడు చాలా మంది కూడా నా ఈ అత్య్తుత్తమ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సాధించగలిగాను అనే వాక్యాలు నిజంగానే మొబైల్ ఫోన్ వాడితే అంత నష్టం జరుగుతుందా…. యువతను ఆలోచనలో పడేసినట్లు అయ్యింది. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవనశైలిలో తప్పనిసరిగా మారిపోయింది. సమాచారాన్ని సులభంగా పొందడానికి, ప్రపంచంతో అనుసంధానం కోసం, మన వృత్తిపరమైన పనులు నిర్వహించడానికి కూడా ఇది అవసరమైన సాధనమైంది. కానీ, అదే మొబైల్ ఫోన్ మన మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను, భావోద్వేగ నియంత్రణను మెల్లగా దెబ్బతీస్తోంది.

నేటి ఆధునిక ప్రపంచంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా విజయం సాధించడంలో ఒక ముఖ్యమైన అంశం. మొబైల్ ఫోన్‌ను నియంత్రించడం ద్వారా మనం మన స్వీయ నియంత్రణను మెరుగుపరుచుకోవచ్చు. ఇది కేవలం చదువులకే కాదు, జీవితం మొత్తానికి కూడా మంచి మార్గనిర్దేశం అవుతుంది. ఏ రోజు కూడా మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సివిల్స్ లో మంచి ర్యాంక్ అనే వాక్యం, మానసిక స్థిరత్వం మరియు దీర్ఘకాలిక లక్ష్య సాధనానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదీ స్పష్టం చేస్తుంది.

 

సివిల్స్ పరీక్షలు వంటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే ఏకాగ్రత, పట్టుదల, నిర్ణయం తీసుకోవడంలో మెళకువలు చాలా అవసరం. విజయం సాధించడానికి సహనం మరియు నిబద్ధత చాలా ముఖ్యం. అలాంటి సందర్భంలో వరంగల్ కి చెందిన సాయి శివాని మొబైల్ ఫోన్ వాడకుండా సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసుల పరీక్షకు సిద్ధం అవ్వడానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఫోన్ వాడకపోవడం వల్ల సమయం ఆదా అవుతుంది, ఆ సమయాన్ని చదవడానికి మరియు అభ్యసించడానికి ఉపయోగించవచ్చు. సాయి శివాని మొబైల్ ఫోన్ వాడకపోవడం వల్ల తనలో ఉన్న మానసిక స్థితిని ఎంతగానో బలోపేతం చేసిందని చెప్పవచ్చు.

మానసిక శాస్త్ర పరంగా, మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువైతే డిజిటల్ డిపెండెన్సీ పెరిగి, ఏకాగ్రత లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్లు మనలో ఓ నిరంతర అస్థిరతను, మనసులో వ్యాకులత ను పుట్టిస్తాయి. ఫలితంగా, దీర్ఘకాలికంగా చదువుపై సమగ్ర దృష్టి పెట్టడం కష్టమవుతుంది.

మొబైల్ వాడకం మరియు మానసిక ప్రభావం:

ఏకాగ్రత పై ప్రభావం

కాగ్నిటివ్ సైకాలజీ లో చెప్పినట్టు, మన మెదడు ఒక సమయంలో పరిమిత సమాచారం మాత్రమే ప్రాసెస్ చేయగలదు. మొబైల్ ఫోన్ వాడకం వల్ల మెసేజ్ లు, సోషల్ మీడియా ద్వారా మన లో ఉన్న ఏకాగ్రతను తగ్గిస్తుంది. ఇది వర్కింగ్ మెమొరీ లో గందరగోళాన్ని కలిగిస్తుంది, ఎక్కువ కాలం నేర్చుకోవాలనే ఆసక్తిని తగ్గిస్తుంది.

డిజిటల్ డిస్ట్రాక్షన్

మొబైల్ వాడకంతో చదివేటప్పుడు మధ్య మధ్యలో పదే పదే అటెన్షన్ కోల్పోవడం జరుగుతుంది. దీనినే మనం అటెన్షన్ రెసిడ్యూ అని పిలుస్తారు. ఒక పని నుండి మరొక పనికి మారినపుడు, మన మెదడు పూర్తిగా కొత్త పనిలో మునిగిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ వరుస మధ్యలో మొబైల్ చూసి తిరిగి చదువుకు వస్తే, కాన్సెంట్రేషన్ పెరుగడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మానసిక ఆరోగ్యం పై ప్రభావం

ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల మానసిక ఆందోళన, నిద్ర సరిగా రాకపోవడం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, ఎక్కువ స్క్రీన్ టైం వాడే యువతలో మానసిక అసంతృప్తి స్థాయి ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.

సమయ నిర్వహణ లో సమస్యలు

టైమ్ మేనేజ్మెంట్ లో అసమర్థత, ముఖ్యంగా నిర్దిష్ట లక్ష్యాలపై పనిచేసే సమయంలో మొబైల్ వాడకం వల్ల అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోకపోవడం జరుగుతుంది.

మొబైల్ ను దూరం పెట్టడం వల్ల కలిగిన మానసిక లాభాలు

అధిక ఏకాగ్రత

చదువుకునే సమయానికి పూర్తిగా మొబైల్ దూరంగా ఉంచుకోవడం ద్వారా, అభ్యర్థి మనస్సు పూర్తిగా ఒకే పనిపై దృష్టిని పెట్టె సామర్థ్యాన్ని పొందుతాడు. ఇది నెమ్మదిగా ఫ్లో స్టేట్ లోకి ప్రవేశించేందుకు దోహదం చేస్తుంది. ఫ్లో స్టేట్ అనేది అత్యధిక శక్తి ఉత్పాదకతను, సృజనాత్మకతను మెదడుకు అందిస్తుంది.

ఆత్మ నియంత్రణ

మొబైల్ వాడకాన్ని నియంత్రించడం (సెల్ఫ్ కంట్రోల్) వల్ల అభ్యర్థి తన తాత్కాలిక సంతోషాన్ని నియంత్రించి, దీర్ఘ కాలిక లక్ష్యాలపై  పై దృష్టిపెట్టే శక్తిని పెంపొందించుకుంటారు. ఇది శాశ్వత సంతోషాన్ని అందిస్తుంది అనే భావనకు సంబంధించినది మెరుగుపరచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.

ఆత్మవిశ్వాసం పెరగడం

మొబైల్ డిస్ట్రాక్షన్ల నుంచి దూరంగా ఉండడం, రోజువారీ పాఠ్యాంశాలను పూర్తి చేయడం ద్వారా అభ్యర్థిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను నా లక్ష్యాన్ని చేరుకోగలను అనే భావన పెరుగుతుంది.

భావోద్వేగ నియంత్రణ

ఫోన్ వాడకం లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గి  ప్రత్యేకించి పరీక్షల సమయం లో పరీక్ష ఆందోళన తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మానసిక ఆరోగ్య పరంగా, తక్కువ మొబైల్ వాడకం మానసిక ప్రశాంతతను, భావోద్వేగ నియంత్రణను  పెంచుతుంది. ఇది పరీక్ష సమయాల్లో ఒత్తిడిని తగ్గించి, ఉత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి దోహదం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page