రేపు టెన్త్ ఫలితాల విడుదల

– మీ సేవ వాట్సాప్ ద్వారా ఫలితాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి చెబుతున్నా తాజాగా ఈనెల 29న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది.

మీ సేవ వాట్సాప్ ద్వారా.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఎస్సెస్సీ రిజల్ట్స్ ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్‌ఫోన్‌లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(టెన్త్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు తమ ఫలితాలను బుధవారం(29వ తేదీ) మధ్యాహ్నం 2:30 గంటల నుండి వాట్సాప్ ద్వారా ద్వారా వెంటనే పొందవచ్చు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నారు.
ఫలితాలు పొందే విధానం
1. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను MeeSeva Telanganaగా సేవ్ చేసుకోండి.
2. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్‌ (Hi) అని మెసేజ్ పంపండి.
3. ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్ చేయండి.
4. మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్‌లో అందుతుంది.
ఫలితాలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేపర్‌లెస్, ఎలాంటి క్యూలు లేకుండా, సులభమైన సేవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందించడంలో ముఖ్యమైన మైలురాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో ప్రజల కోసం మీ సేవ మరింత సౌలభ్యం, పారదర్శకతతో సేవలు అందిస్తూ విస్తరిస్తోంది.
 
ప్రారంభం నుండి విశేష స్పందన
18 నవంబర్ 2025న ప్రారంభించినప్పటి నుండి మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. ఇది వేగంగా విస్తరించిన డిజిటల్ సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది.
అత్యధికంగా ఉపయోగిస్తున్న సేవలు
జనన సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్, ‘సెట’ హాల్ టికెట్ డౌన్‌లోడ్లు, ఇంటర్ బోర్డు ఫలితాలు. ఇప్పుడు ఎస్సెస్సీ రిజల్ట్స్.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *