– ప్రమోషన్ తర్వాత రెండేళ్లు ఇతర విభాగాల్లో పనిచేయాలి
– పోలీస్ అధికారుల సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : డిపార్టుమెంటులో ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తరవాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేయాలని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో పోలీస్ సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ శిక్షణలోనే సైబర్ క్రైమ్ విభాగం లో పనిచేసేందుకు ఎంపిక జరగాలని, అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్పై పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికతను పెంచాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై విజిలెన్స్ దృష్టి పెట్టాలని, డేటా అనాలసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైంపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలని, విజిలెన్స్కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలని, మునిసిపల్, హైడ్రాతో సమన్వయం చేసుకుని అగ్నిమాపక శాఖపై జూన్ 15 లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని, మ్యాన్ హోల్స్ నిర్వహణపై పోలీస్, ట్రాఫిక్ పోలీస్ ,హైడ్రా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. నగరంలో అడ్డగోలుగా ఫెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫెక్సీలను నియంత్రించాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్లు, జీహెచఎంసీ అధికారులు ఫెక్సీలపై కఠినంగా ఉండాలన్నారు. నైట్ పెట్రోలింగ్ను పెంచాలిలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ,అదనపు డీజీ లు, పోలీస్ కమిషనర్లు, ఐజీలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



