వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలి..
పౌర ప్రజా సంఘాల డిమాండ్
కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఏప్రిల్ 26: మధ్యభారతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో కర్రెగుట్టల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్. అధ్యక్షుడు డాక్టర్ జి.లక్ష్మణ్, విరసం నాయకుడు పాణి, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, భారత్ బచావో జాతీయ నేతలు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నారెడ్డి, హెచ్ఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య తదితరులు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో భారత్ బచావో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంగళ్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల ముందు మావోయిస్టులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు.. ఇప్పుడు ఎందుకు శాంతి చర్చల కోసం ముందుకురావడం లేదని ప్రశ్నించారు. కేంద్రాల్లోని బిజెపి, ఛత్తీస్ గఢ్ బిజెపి ప్రభుత్వం రాజకీయ సమస్యకు పరిష్కారాన్ని హింస ద్వారా ముగించాలని పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
చివరికి శాంతి చర్చలే పరిష్కార మార్గమని పేర్కొన్నారు. దేశ ప్రజలపైనే సైన్యాన్ని ప్రయోగించడం తన పిల్లలని తాను చంపుకోవడం కాకుంటే మరేమవుతుందని వారు ప్రశ్నించారు. చర్చల కోసం మావోయిస్టు పార్టీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపినప్పటికీ పోలీసుల అణచివేత ద్వారా మాత్రమే సమస్య పరిష్కారమవుతుందని అనుకోవడం పాలకుల భ్రమ మాత్రమే అవుతుందని విమర్శించారు. హిందుత్వ ఫాసిస్ట్ పాలకుల్లో మానవీయ విలువల కోణంలో ఆలోచించడం లేదని నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా ప్రజలు శాంతిని కోరుకుంటున్నారనే విషయాన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పాలకులు ఆలోచించాలని కోరారు. ఏడాదికాలంగా 480 మంది ఆదివాసీలను హత్య చేశారని ఆరోపించారు. దేశంలోని ఆదివాసీలు కూడా హిందువులేననే విషయాన్ని ఫాసిస్ట్ పాలకులు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ఆదివాసీల ప్రాణాలను కాపాడటం కోసం చర్చల్ని ఆహ్వానించాలని కోరారు. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలపై మొహరించిన భారీ సైనిక బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని కోరారు.
గత ప్రభుత్వాలు కూడా ఈశాన్య భారత్ లోని తిరుగుబాటు సంస్థలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిధిలోనే శాంతి చర్చలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత రాజకీయ సంప్రదాయాలను, చరిత్రను, సంస్కృతిని ప్రస్తుత పాలకులు చదివి అర్థం చేసుకొని చర్చల కోసం ముందడుగు వేయాలని కోరారు. మరోవైపు పారా మిలిటరీ బలగాల్లోని సిబ్బంది సైతం తీవ్రమైన ఎండలకు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు.
హింస ద్వారా పాలకులు సాధించేదేమీ లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి బిజెపి పాలకుల మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ ప్రజాప్రంట్ రాష్ట్ర నాయకులు రవిచందర్, జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి, ఏఎంబిఎస్ అధ్యక్షురాలు జన్ను శాంతమ్మ, రమా ఆజాదీ, పౌర హక్కుల సంఘం నాయకులు రమేష్ చందర్, ప్రవీణ్ కుమార్, డిటిఎఫ్ ఎం.గంగాధర్, తంగెళ్ల సుదర్శనం, లింగారెడ్డి, విరసం కోడం కుమార్, సిఎంఎస్ కళావతి, డిబిఎఫ్ నేత రాజేందర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్న అప్పారావు, డీబీఎం క్రాంతి, అరసం డాక్టర్ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.