- తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టు ప్రతిపాదన
- జీడబ్ల్యూడీటీ, రాష్ట్ర పునర్విభజన చట్టం ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్
- గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల జలాల వినియోగానికి బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి
- పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేయండి
- మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించండి
- ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం
- జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి
దిల్లీ, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్-1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రికి వారు తెలియజేశారు. ఢల్లీిలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, జీడబ్ల్యూడీటీ-1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని అన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోందని తెలియజేశారు. బనకచర్ల విషయంలో ఏ నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్ వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరమని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని కేంద్రమంత్రి పాటిల్కు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహామండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలియజేశారు. జీడబ్ల్యూడీటీ-1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ఎaవంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్రం దృష్టి సారించాలని సీఎం కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం-బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి-నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని వారు తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నిస్తామని సీఎం కేంద్ర మంత్రి పాటిల్ కు తెలియజేశారు. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం స్పష్టం చేశారు.
మేం 1500 టీఎంసీలకు వాడుకునేలా అనుమతులు ఇవ్వండి….
తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని జల్శక్తి మంత్రి పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేప్టటే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలి
గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడిరచారు. బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ తమకు అందలేదని కేంద్రమంత్రి తెలిపారని, త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.