రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతుల భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతభావానికి తావు నీయకుండా భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు, సాదాబైనామాలు వంటి సేవలు సులభతరమవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా భూ భారతి రూపొందించారని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజల దగ్గరకు అధికారులు వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనమాలు, పాసు పుస్తకాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని స్పీకర్ తెలిపారు. గ్రామీణ, ప్రజల భూ సమస్యలు పరిష్కరించినట్లయితే ప్రభుత్వ పథకాలైన రైతు బీమా, రైతు భరోసా ద్వారా లబ్ది పొందుతారని ఆ దిశగా పని చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు సమస్యలను తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయల్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, 200 యూనిట్లకు కరెంట్ ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. భూ సమస్యలు తీర్చడంలో ప్రజలకు భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.జిల్లాలోని అటవీ భూముల పరిష్కారానికి కొత్త చట్టం ఎంతో దోహదపడుతుందని అన్నారు. తాండూరు ఎమ్మెల్మే బి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ 2 నుంచి నూతన చట్టం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లుతెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల సుజాత, తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు.