రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

  • రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్
  • విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు
  • బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై, కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు. సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ప్రజా బలాన్ని ఈ సభ మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైనప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

భారీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, సభ విజయవంతంగా పూర్తి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. నిన్నటి రజతోత్సవ సభ కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన తెలిపారు. కేసీఆర్ స్వయంగా “నేనే ముందుండి పోరాడతాను” అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్ అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలను, వారి ప్రచారాలను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని, మరింత చురుకుగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్

రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణితో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వొచ్చి సభ విజయవంతం చేయడంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సభా ప్రాంగణం వద్ద గత నెల రోజులుగా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగా ఈ సభ ఎంతో విజయవంతమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ బహిరంగ సభను పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు, పార్టీ శ్రేణులకు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరందరి కృషితో ఈ చారిత్రాత్మక సభ మరువలేని ఘట్టంగా నిలిచిందని చెప్పారు. అదేవిధంగా, మంచి కవరేజ్ తో సభా కార్యక్రమాలను ప్రజలకు అందించిన మీడియా ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page