నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ ఫ్లైఓవర్
త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ట్రాఫిక్ కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ సిక్స్ లేన్ ఫ్లైఓవర్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. ఇది భాగ్యనగరంలోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్. 24 మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 636 కోట్ల ఖర్చయింది. ఫ్లైఓవర్కు రెండువైపులా ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు పూర్తి చేయడమే ప్రాజెక్టులో అతి పెద్ద సవాల్. ఈ రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి సర్వీస్ రోడ్ను చకచకా నిర్మిస్తున్నారు.ఫ్లైఓవర్ పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి బల్దియా కమిషనర్ ఇటీవలే పనులను పర్యవేక్షించారు.
నాలుగు రోజుల్లో సర్వం సిద్ధమై.. సీఎం చేతుల మీదుగా ప్రజలకు అంకితమవుతుంది. నగరం అంతటా పట్టణాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ‘‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు’’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ వల్ల శాస్త్రిపురం, కాలాపత్తర్ వంటి కీలకమైన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇది గనుక అందుబాటులోకి వస్తే.. జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టు, మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇక ఆగాల్సిన పనే ఉండదు. జూపార్క్కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుంది.