రాజకీయ కక్షతోనే కాళేళ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

  • కాళేశ్వరంపై ఆధారాలతో సహా వాస్తవాలతో శ్రీధర్ దేశ్ పాండే పుస్తకం
  • ప్రాజెక్టుపై వక్రీకరణలు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి
  • ‘కాళేశ్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నిలబడితే, వారు చేసిన మంచిని కొనసాగిస్తే చరిత్రపుటల్లో నిలిచిపోతారనే రాజకీయ కక్షతో రైతుల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధిని పొందుతున్నాడని విమర్శించారు. తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు – విమర్శలు – వక్రీకరణలు – వివరణలు’’, ‘‘ సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం’’ పుస్తకాలను తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాష్, అంబేద్కర్ వర్సిటీ మాజీ వీసీ కె.సీతారామారావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు జి.దేవీ ప్రసాదరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిటైర్డు ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశం, సీనియర్ జర్నలిస్టు పి. వేణుగోపాల స్వామి, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మూడు ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలని. కాళేశ్వరంపై జరుగుతున్న వక్రీకరణలు, వాస్తవాలు, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని దెబ్బతీసిన విధానాన్ని గుర్తించాలని సూచించారు. పుస్తక రచయిత శ్రీధర్ దేశ్ పాండే తెలంగాణ పట్ల ఆయనకుండే మమకారం, ప్రేమ.. తెలంగాణలో నీళ్లు పారాలని తపన తాను స్వయంగా గుర్తించానని తెలిపారు. నీతికి నిజాయితీకి మారుపేరు. చాలా క్రమశిక్షణ కలిగిన జీవితం ఆయనదని అన్నారు.
తెలంగాణ సాగునీటి రంగంపై దుష్ప్రచారం చేస్తున్న సమయంలో దేశ్ పాండే పుస్తకాలు నిజాలు వాస్తవాలతో కూడి ఉన్నాయని కొనియాడారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అనే నానుడి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎప్పుడైనా రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తాగునీటి రంగంలో కేసీఆర్ వందేళ్ల ముందుకు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.


కాళేశ్వరంలో థర్డ్ టీఎంసీ ఎందుకు పెట్టారని అన్నారు. భవిష్యత్తులో 50 సంవత్సరాల తర్వాత కరువొచ్చినా నీళ్లను ఒడిసిపట్టి నిలుపుకోవడానికి మూడో టీఎంసీ ఉపయోగపడుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ కట్టినప్పుడు ప్రతి సంవత్సరం వరద విపరీతంగా ఉండేది కానీ పైన రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి నీళ్లు నింపుకొని కిందకు వదులుతే తప్ప నీళ్లు వొచ్చే పరిస్థితి లేదు. తుమ్మిడి హట్టి దగ్గర నుంచి ఎందుకు రీ డిజైన్ చేశారు ? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం కట్టామని కొందరు విమర్శిస్తున్నారని, 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని, 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండి కూడా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు.
సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్స్ ల పేరు మీద 2,700 కోట్లు పందికొక్కులా దోచుకుంది ఆనాటి ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రితో భేటీ అయ్యాం. గతంలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముంపు ఎక్కువ ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణానికి మేము ఒప్పుకోమని ముషారఫ్ అనే మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి తేల్చి చెప్పాడు. ఆ తర్వాత బిజెపి నాయకుడు ఫడ్నవీస్ కూడా ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందే మేము కనుక ఈ ప్రాజెక్టును అంగీకరించమని చెప్పారు. కేసీఆర్ వారి పుట్టిన రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో గిల్లికజ్జాలు పెట్టుకోం. బాబ్రీ ప్రాజెక్టుతో గొడవలు పెట్టుకోం. మాకు ఈ ప్రాజెక్టు అవసరం మా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వొస్తాయని విజ్ఞప్తి చేశారు. ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు ముందే గంటలకొద్దీ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ నీటి కష్టాలను వివరించారు. మార్చి 2005, ఏప్రిల్ 2005లో కేంద్ర జల వనరుల శాఖ తుమ్మిడి హట్టి వద్ద నీళ్లు లేవు.. పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు పోను కింద ఉండేది 102 టీఎంసీలు మాత్రమే అని స్పష్టం చేశారు.

152 మీటర్ల ఎత్తులో కడితే 102 టీఎంసీల నీళ్లు మాత్రమే మన రాష్ట్రానికి వొస్తాయి. 150 మీటర్లకు ఆ ఎత్తును తగ్గిస్తే 40 టీఎంసీలకు మించి నీళ్లు ఉండవు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్ నీళ్లు లేని తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలా? లేక నీళ్లున్న దగ్గర ప్రాజెక్టును నిర్మించాలా? వాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాడారు సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయని సర్వే రిపోర్ట్ ఇచ్చారు. 240 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ వద్ద వాడుకోవడానికి కేంద్ర జల వనరుల శాఖ అనుమతి ఇచ్చిందని మాజీమంత్రి హరీష్ రావు వివరించారు.
శ్రీధర్ దేశ్ పాండే రాసిన ఈ పుస్తకంలో సీడబ్ల్యూసీ రిపోర్టు, పర్మిషన్లు ఉన్నాయి. గ్రావిటీ ద్వారా వొచ్చే నీళ్ళకు లిఫ్టు పెట్టారని అవివేకంగా మాట్లాడుతున్నారు. తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కూడా లిఫ్ట్ తోనే నీళ్లు వొస్తాయి కానీ గ్రావిటీతో రావు. అది దుష్ప్రచారం మాత్రమే.. ఈ వాస్తవాన్ని కూడా దేశ్ పాండేఈ పుస్తకంలో పొందుపరిచారు.స్టేట్ ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తప్పు పట్టలేదు. మేడిగడ్డ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే విధానంపై వారు అభ్యంతరం చెప్పారే కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టవద్దని అనలేదు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఆయకట్టు 16 లక్షలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల 27 వేల కొత్త ఆయకట్టు, 18 లక్షల 87 వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. రెండూ కలిపితే కాళేశ్వరం ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 141 టీఎంసీల నీటి సామర్ధ్యాన్ని నిలువ చేసే రిజర్వాయర్లను కట్టారు. గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులను ఎస్టాబ్లిష్ చేయడానికి మూడవ టీఎంసీని ప్రారంభించారు. భారతదేశంలో ఐదు రెట్లు, పది రెట్లు ప్రాజెక్టు ఖర్చు పెరగకుండా ఏ ప్రాజెక్ట్ కట్టింది లేదు. నాగార్జునసాగర్ కి పది రెట్లు కాస్ట్ పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకి 100 రెట్లు కాస్ట్ పెరిగింది. జూరాల, పులిచింతల ఇలా అన్ని ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు రెట్టింపు అయింది. ఈ రాష్ట్రంలో లోయెస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయింది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు సర్వేకు 670 కోట్లు చెల్లించారని, పీసీ ఘోష్ కమిషన్ కి తెలిసిందని వక్రీకరించిన వార్తలు పేపర్లలో వొచ్చాయి. జీవో నెంబర్ 40, తేది 18/1/2016 నాటి ప్రకారం సర్వేకి చెల్లించింది 6 కోట్ల 77 లక్షలు. తిమ్మిని బమ్మిని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తుందన్నారు.
ప్రాణహిత చేవెళ్లకి ఏడేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద 2,600 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు ఇచ్చారు. బీఆర్ఎస్ అవినీతి చేసింది అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. మల్లన్న సాగర్ కట్టినప్పుడు నది లేని చోట రిజర్వాయర్ కడతారా అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కండలేరు ప్రాజెక్టుని 68 టీఎంసీలతో కట్టారు. గోరకల్లు ప్రాజెక్టు పది టీఎంసీలతో కట్టారు. వెలిగొండ ప్రాజెక్టు నలభై ఒక్క టీఎంసీలతో ఉంది. బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలతో ఉంది.

సాగునీటి రంగాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా నీళ్లను దోచుకొని ఇప్పుడు గోదావరి నీళ్లను దోచుకునేందుకు తెర లేపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బొల్లంపల్లి రిజర్వాయర్ ని 150 టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేస్తుంది. వరద ఉన్నప్పుడు నీళ్లు నింపి పెట్టుకోవడానికి ప్రాజెక్టును రెడీ చేసి పెట్టుకుంటున్నారు. హైదరాబాద్, తెలంగాణ తాగు సాగునీరు అవసరాల కోసం మల్లన్న సాగర్ ని నిర్మించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ సమస్య అవుతున్నదని నేను అన్నప్పుడు కేసీఆర్ కొన్ని కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో నష్టపోతాయేమో కానీ భవిష్యత్ లో కొన్ని లక్షల కుటుంబాలకు లాభం జరుగుతుంది. తెలంగాణకు వరంగా మారుతుందని చెప్పారు.
కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తూనే మల్లన్న సాగర్ నుంచి తాగునీటిని హైదరాబాద్ కు తరలించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు టెండర్లను పిలిచింది. హైదరాబాద్ మంచినీటికి, మూసీ శుద్ధి చేయడానికి మీరు తెచ్చే నీళ్లు ఎక్కడివి రేవంత్ రెడ్డి? మల్లన్న సాగర్ వి కావా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ దూరదృష్టితో మల్లన్న సాగర్ నిర్మించారు కాబట్టే ఈరోజు 20 టీఎంసీల నీటిని హైదరాబాదుకు తేగలుగుతున్నారు.

ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడైనా బ్యారేజ్ రెండు, మూడు టీఎంసీలకు మించి ఉండద ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఆయన చదువుకున్నోడే విజ్ఞుడే కానీ ఎందుకో అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు. మనదేశంలోనే గంగా నదిపై ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజే ఏడు టీఎంసీలు ఉంటుంది. కెఆర్ఎంబీ మీటింగ్ తర్వాత ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని నిర్ణయించామని ఈఎన్సీ చెప్పాడు. పదేళ్లు ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పకుండా ఆపితే ఇప్పుడు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అప్పజెప్పిందని కేసిఆర్ నిలదీశారు. కేసీఆర్ ప్రశ్నించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాంగ్రెస్ చేసిన గొప్ప పని 66 : 34. అంటే కృష్ణాలో నీటి వాటా రెండు రాష్ట్రాలకి 299/ 512 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మీరు కట్టిన ప్రాజెక్టులకు కేటాయించిన నీటి వాటా 299 టీఎంసీలు మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్లో 512 టీఎంసీల ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్ ఉండంగా ప్రతి సంవత్సరం 36% నీళ్ళను కృష్ణాలో వాడుకున్నాం. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం 27% నీళ్లను మాత్రమే వాడుకుంది. ఉన్న 34 శాతం నీటిని కూడా వాడే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ 715 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ 275 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా పూర్తి నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకోలేకపోయింది. శ్రీశైలం అనే ప్రాజెక్టు హైడల్ జనరేషన్ కోసం కట్టిన ప్రాజెక్టు. కానీ ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుకి పొక్కపెట్టి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 34 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన 24 గంటల కరెంటు ఇయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ఉండేది. దాని పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2021లో జీవో ఇస్తే దానిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తిగా కరెంటు ఉత్పత్తి చేయము నీటిని ఉంచుతాము అని ఒప్పుకున్నారు. శ్రీశైలంలో నీటిని ఉంచేది ఆంధ్రప్రదేశ్ కోసమా ? సెక్షన్ 3 కేసీఆర్ సాధించిన గొప్ప విజయం. జులై 2014లోనే ఆనాటి నీటి వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి కృష్ణానది జలాల పునర్ పంపిణీ జరగాలని పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి తిరిగి తిరిగి వినకపోతే సుప్రీంకోర్టులో కేసు కూడా వేసాం.

కృష్ణా నది తెలంగాణలో 68% ఉంది కాబట్టి 570 టీఎంసీల నీళ్లు తెలంగాణకు దక్కుతాయి. తెలంగాణకు శాశ్వత పరిష్కారాన్ని కేసీఆర్ చూపించారు. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి నీటి హక్కును సాధించాలంటే ప్రభుత్వ నీటిపారుదల సలహాదారుడు అవసరం. ఆ పోస్టులో రాయలసీమ లిఫ్ట్ ను పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్ లో, సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఆదిత్యనాథ్ ని పెట్టుకున్నారు. తెలంగాణ నీటిని దోచుకోవాలని చూసిన వ్యక్తిని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఇరిగేషన్ ముఖ్య సలహాదారులుగా పెట్టుకున్నాడు. సిడబ్ల్యూసీ చైర్మన్ గా ఉన్నప్పుడు అడ్డుకున్న కృషి హోరా అనే వ్యక్తిని తెలంగాణ నీటి వాటా కోసం ట్రిబ్యునల్ ముందు వాదించే వ్యక్తిగా అపాయింట్ చేశారు. ఇలాంటి దొంగల చేతిలో తెలంగాణ నీటిని తెలంగాణ ప్రభుత్వం పెట్టింది.
జలహారతి అని ఒక కార్పొరేషన్ పెట్టి డీపీఆర్లు రెడీ చేసి టెండర్లను పిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
గోదావరి నీళ్లను కూడా దోచుకునే కుట్రలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కుట్రలను ఆపే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా? కేఆర్ఎంబీ ముందు గట్టిగా వాదనలు వినిపించండి లేదంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి చైర్మెన్ గా మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన జల హారతి ఆపాలి అని పోరాటం చేయండి. ఎందుకు అపెక్స్ కౌన్సిల్ను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేయడం లేదు.

వీళ్ళు వచ్చిన ఏడాదిన్నరలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఖమ్మం పెద్ద వాగు కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ కుప్ప కూలింది.
ఇక ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుతో నీళ్లు రాకుండా చేయాలనే కుట్రకు ఆంధ్రప్రదేశ్ తెర లేపిందని ఆనాడే అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ఆగమాగం పోయి నిపుణుల సలహాలు తీసుకోకుండా ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తొందరపాటుకు 8 ప్రాణాలు పోయాయి. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకానికి టీబీఎం మెషిన్ వాడుతారు అది పది మీటర్ల సొరంగాన్ని తవ్వుకుంట లోపటికి వెళుతుంది. అది లోపటికి వెళ్లడం తప్ప బయటకు వొచ్చే అవకాశం లేదు. అప్పటికి పోతున్నప్పుడు పది మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపటికి వెళుతుంది. అక్కడి నుండి 1.8 మీటర్ల మేర సిమెంట్ లైనింగ్ వేసుకుంటూ వస్తారు. అంటే నీళ్లు 9.2 మీటర్ల వ్యాసంలోనే వొస్తాయి. సొరంగం పూర్తయ్యాక, పూర్తయిన చోటే ఒక దగ్గర సైడ్ కు ఆ మిషన్ ని పాతి పెడతారు. అవుట్ లెట్ కూలడంతో టీబీఎం మిషన్ పనికి రాకుండా అయిపోయింది. అది బయటకు రాదు ముందుకు పోదు. అది పది మీటర్లు ఉంటే సిమెంట్ ఫ్రేమింగ్ అయిన తర్వాత తొమ్మిది మీటర్లు మాత్రమే మిగిలింది. లైనింగ్ కూలగొట్టలేము మిషన్ బయటకు రాదు. ఎస్ఎల్బీసీ త్రిశంకు స్వర్గంలో పడింది. రెండు నెలలు అయితుంది శవాలు బయటకు తీసే పరిస్థితి లేదు. ప్రాజెక్టును ప్రారంభించే పరిస్థితి లేదు. ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిది లేదు. ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. అసెంబ్లీలో ఉత్తంకుమార్ రెడ్డి స్పీచ్ ఇస్తూ ఏడాదిలో ఆరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. మాది చేతల ప్రభుత్వమని అన్నారు. మొన్న అసెంబ్లీలో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు కదా అని అడుగితే దానిపై మాట్లాడడంలేదు.

సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రగతి ప్రస్థానం

మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణను కేసీఆర్ తెలంగాణ సాధనకు రెండేళ్ల ముందే ఆలోచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష చేశారే తప్ప పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. నేల మీద పడుకొని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం. ₹4,000 కోట్లు ఖర్చు చేసి వలసల జిల్లా పాలమూరుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. ఒకసారి మహబూబ్ నగర్ పర్యటనలో ఒక రైతు నన్ను కలిసి ఎలా ఉంది తెలంగాణ అంటే నీళ్లు ఫుల్లు చాపలు ఫుల్లు అని అన్నాడు. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్ట్ ని 11 నెలల్లో పూర్తిచేసి వేల ఎకరాలకు నీళ్ళిచ్చాం. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ను పది నెలల్లో పూర్తిచేసి నీరిచ్చాం. పాలమూరు రంగారెడ్డి 80 శాతం పూర్తయింది. ట్రయల్ రన్ కూడా పూర్తయింది నీళ్లు కూడా బయటకు వొచ్చాయి. కేవలం ప్యాకేజీ 3 కింద నాలుగైదు కిలోమీటర్ల మేర రాళ్లను తొలగించి కాల్వ పూర్తి చేస్తే పాలమూరు జిల్లాకు ఈ వానాకాలం 50 టీఎంసీల నీళ్లు వొచ్చేవి. ఏడాదిన్నర కాలంలో మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ తవ్వే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదా? ఈ ప్రభుత్వానికి తెలివి లేక, నీళ్లు వాడక 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించారు.
ఎక్కడ పేరు వస్తుందో అని ఏడాదిన్నర ప్రాజెక్టును పడావు పెట్టి ఇప్పుడు మళ్ళీ రెండేళ్లు పడుతుందని నిన్న ఉత్తమ్ అంటున్నాడు. పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి అన్యాయం చేస్తున్నారు.

సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసింది. కేసీఆర్ మెదడును కరిగించి సీతారామ సాగర్ ను రూపొందించారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దేవాదుల 72 మీటర్ల లెవెల్ వద్ద మెయింటైన్ గాక మోటర్లు నడవకపోయేవి. సమ్మక్క బ్యారేజీ కట్టి సంవత్సరానికి 205 రోజులు నీళ్లు తీసుకునేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది.
ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి దేవాదుల కింద 600 ఎకరాల పంటను ఎండబెట్టారు. 6 కోట్ల రూపాయలు దేవాదుల పంప్ హౌస్ మెయింటెనెన్స్ కు ఇచ్చే తెలివి లేక 40 రోజులు లేటుగా నీళ్ళని ఇచ్చారు. మేము ప్రాజెక్టులు పడితే కనీసం మెయింటెనెన్స్ చేసే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నాగార్జునసాగర్ మోడ్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకోవాలని నిర్ణయించాం.
మేము అప్పుడు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మంత్రి నుంచి కింద కాంట్రాక్ట్ వరకు అందరం ప్రతిరోజు ఆ పనికి సంబంధించిన విషయాలని వాట్సాప్ లో రివ్యూ చేసేవాళ్లం. రెండు సంవత్సరాల్లో కాలువ పనులను పూర్తి చేసి చూపించాం. మా పనితీరుకు వరల్డ్ బ్యాంక్ ఆశ్చర్యపోయింది. మిషన్ కాకతీయ ఫైల్ మానిటరింగ్ సిస్టం అని ఒకటి ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఏఈ సంతకం చేసి ఫైల్ అప్లోడ్ చేస్తే ఒక్కరోజు కంటే ఎక్కువ ఎక్కడా నీటి సరఫరా ఒక్కరోజు ఆగేది కాదు. వెంటబడి పనిచేస్తే కేసీఆర్ గారు పెట్టిన లక్ష్యాన్ని నెరవేర్చాం. ఇలాంటి పనులన్నిటికీ దేశ్ పాండే ఇరిగేషన్ ఓఎస్డీగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు.

పదేండ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించాం. ఐదేండ్లలో 50 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లిచ్చింది. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేశాం. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 2004 నుండి 14 వరకు ఐదు లక్షల 75 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 93 వేల ఎకరాలకు స్థిరీకరణ మాత్రమే జరిగింది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు గుండు సున్నా. తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా దేశ్పాండే గారు రచించిన పుస్తకాలను చదవాలని కోరుతున్నాను. ఈ పుస్తకాల్లో పూర్తి వాస్తవాలతో ఏ ప్రాజెక్టు కింద ఏ జిల్లాలో ఎంత ఆయకట్టు కొత్తగా వచ్చింది, ఎంత ఆయకట్టు స్థిరీకరించామని ఆధారాలతో సహా పొందుపరిచారు. అబద్ధాలు ప్రచారం చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పుస్తకాలతో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా శ్రీధర్ దేశ్ పాండేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని హరీష్ రావు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page