- నిరంతర నిఘా పెంచాలి…
- ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి
పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్లో నరమేథం సృష్టించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు రాకుండా…సామాన్య జనం అక్కడ లేకుండా..ముఖ్యంగా హిందువులను లేకుండా చేయాలన్న ముస్లిం ఉగ్రవాదుల కుట్రలో భాగమే తాజా నరమేధానికి నిదర్శనం. 370 ఆర్టికల్ రద్దు తరవాత కాశ్మీర్ అభివృద్ది చెంది, పర్యాటకంగా పునరుత్తేజం పొందడాన్ని ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న పాక్ జీర్ణించుకోవడం లేదు. ఈ దాడిని ముందే పసిగట్టడంలో కూడా భద్రతాబలగాలు విఫలం అయ్యారు. ఇకపోతే ఇదొక అనుభవంగా, గుణపాఠంగా కాశ్మీర్ను మొత్తం మిలిటరీకి అప్పగించాలి. శ్రీలంకలో ఈలం అన్నది లేకుండా చేసేందుకు సైనిక చర్య చేపట్టి విజయం సాధించారు. అనేక దేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు కాశ్మీర్లో జల్లెడ్ పట్టాలి. అణువణువు పరిశీలించాలి.. అక్కడి స్థానికులను రక్షిస్తూనే… కొత్తగా వస్తున్న వారిపై నిఘా పెంచాలి. జల్లెలడ పట్టాలి. లెఫ్ట్ తీవ్రవాదం కన్నా ఇస్లామిక్ తీవ్రవాదం చాలా ప్రమాదకరం. మావోయిస్టులను ఏరివేసే పనిని పక్కన పెట్టి కాశ్మీర్లో ఇస్లామిక్ తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. ఈ క్రమంలో పాక్తో సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేయాలి. అలాగే ఆక్రమిత కాశ్మీర్లో నరమేథానికి శిక్షణ ఇస్తున్న శిబిరాలను లేపేయాలి. అవసరమైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను విలీనం చేసుకోవాలి. అందుకు కార్యాచరణ సిద్దం చేయాలి. భారత్ అంటే బలమేమిటో సత్తా చాటి పాక్కు గట్టిగా బుద్ది చెప్పాలి.
మాటలతో పాక్ దారికి రాదు. దానికి గట్టిగా ఉద్ది చెప్పేందుకు సైనిక చర్యకు దిగాలి. 2008లో ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్తానీ తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన చెపుతున్నది. ఉగ్రసంస్థ మతపరమైన లక్ష్యాలను సాధించడానికి లేదా ఒక నిర్దిష్ట మత సమూహానికి వ్యతిరేకంగా దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం జరిగిన సంఘటన ఈ రకమైనదే. తహావూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ముందుగానే తెలిపింది. అయితే, కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సున్నిత పర్యాటక ప్రాంతమైన జమ్మూలో ముందుగానే కేంద్ర, రాష్త బలగాలను అప్రమత్తం చేయడంలో కొంత విఫలమైనట్టు ఒప్పుకోవాలి. ఇప్పటికైనా పర్యాటకులకు ఆటంకం లేకుండా నిరంతర గస్తీని పెంచాలి. బలగాలను ప్రతి గ్రామంలోనూ మొహరించాలి. ప్రపంచంలో ఇస్లామిక్ ఉగ్రవాదం భయంకరమైనదిగా నరరమేథం సృష్టిస్తోంది. దీనిని ప్రపంచ ముస్లింలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలే చర్యలకు పూనుకోవాలి. జమ్మూకాశ్మీర్లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి.
ఇస్లామిక్ టెర్రిరిస్ట్ గ్రూపులు అయిన లష్కర్ -ఏ -తోయిబా, జైష్ -ఏ – మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి. వీరిని ఏరివేసేందుకు ఎలాంటి విూనమేషాలు లెక్కించరాదు. ఎంత కఠినమైన పనయినా వీరిని కలుపు మొక్కల్లా ఏరిపారేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి లేకుపోవడం వల్ల కేంద్ర మిలిటరీ వ్యవస్థ జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ తన కుయుక్తులను కేవలం ఉగ్రదాడులకే ఉపయోగిస్తోంది. పాక్ను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం కాదు…దానిని అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలి. ఇప్పటికే అనేక మారణహోమాలు సాగాయి. ఇలాగే మిన్నకుంటే మరిన్ని దాడులు జరుగుతాయి. భారత్పై కన్నేస్తే అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితులు మారాలి. ఇజ్రాయిల్ తరహా శిక్షణతో సైన్యాన్ని రాటుదేలించాలి. పాక్ను ప్రపంచంతో వేరు చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే భారత్ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. ఈ క్రమంలో ఇలాంటి టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తాజా దాడిలో ప్రత్యేకంగా హిందూవర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం అందరూ ఆలోచించా ల్సిన విషయం. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి.
గత మూడేళ్లుగా కాశ్మీర్ పర్యాటక రంగం పుంజుకుంది. కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఈ తీవ్రవాదులు చేసిన మతాధార మారణకాండ..పుంజుకుంటున్న కాశ్మీర్ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే కాశ్మీర్ పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది.ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు సమర్థనీయమైనవే. పాక్ పౌరులకు భారత్లోకి నో ఎంట్రీ సార్క్ వీసాలన్నీ రద్దుచేయడాన్ని స్వాగితించాల్సిందే. 28మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడమే కాకుండా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో భారత్ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది.
సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా కుదించుకుని బుధవారం ఉదయం భారత్ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉదయంనుంచి కశ్మీర్లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్ పౌరులకు జారీచేసిన వీసాలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు, ఈ వీసాలున్న పాకిస్థాన్ పౌరులు 48గంటల్లోగా భారత్ను వదిలి వెళ్లాలని, ఆ దేశ పౌరులను దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సరిహద్దు దాటిన పాక్ పౌరులు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టునుసైతం తక్షణం మూసి వేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది. మన దేశంలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మొత్తంవిూద ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30 కి కుదించాలని నిర్ణయించారు. ఇవి చేస్తూనే కాశ్మీర్ను మిలిటరీ కేంద్రంగా మార్చాలి. అక్కడ నిరంతర నిఘా పెంచాలి. ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి.
సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్