మళ్లీ దొరల పాలన కోసం కుట్రలు
అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు నీళ్లపాలు
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని జలగలా పీల్చి పిప్పి చేసింది.
కెసిఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపలేదు
అశ్వారావుపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అశ్వారావుపేట, ప్రజాతంత్ర, మే 10 : దొరల పాలన కోసం ప్రజా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు దోపిడీదారులు ఏకమవుతున్నారు తస్మాత్ జాగ్రత్త అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దోపిడీదారుల మాటలు నమ్మకండి, వారిని దూరంగా ఉంచి ఇందిరమ్మ పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేసుకుందామని డిప్యూటీ సీఎం అన్నారు. కెసిఆర్ నువ్వు నీ కుటుంబం నీ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుంటే న్యాయం, రాష్ట్ర సంపదను నాలుగు కోట్ల ప్రజలకు పంచాలని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టడం అన్యాయమా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఏడాదిన్నరగా ఫామ్ హౌస్ లో పడుకొని అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి టిఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్లపాటు పాలించిన వారు ప్రజల శక్తిని జలగల్లా పీల్చి పిప్పి చేశారని, ఆ పాలన నుంచి విముక్తి కోసమే రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే మన జీవితాలు మెరుగవుతాయి, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతుందని పోరాటం చేశామని గుర్తు చేశారు. వనరులు, ఆర్థిక సంపద తెలంగాణ ప్రాంత ప్రజలు వాడుకుంటే వారికి మేలు జరుగుతుందని సోనియాగాంధీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని వారి చేతికి అప్పగిస్తే 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు అన్నారు. పదేళ్ల కాలంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, ఏ ఒక్క దళితునికి మూడెకరాల భూమి పంపిణీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ప్రతి మండలంలో కేజీ టు పీజీ పాఠశాలలో నెలకొల్పుతామన్నారు దాన్ని పక్కన పడేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక పెద్ద పరిశ్రమ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి ఒక భారీ నీటి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.వద్దు బాబు అని అంతా చెప్పినా వినకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలిపోయిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. రాష్ట్ర సొమ్ము కాజేసి దివాలా తీయించి బ్యాంకులకు రాష్ట్రాన్ని కుదరపెట్టి తగుదునమ్మ అంటూ కేసిఆర్ కుటుంబం మాట్లాడుతుందని విమర్శించారు. ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం, 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నాం కేసిఆర్ ఇది కనబడడం లేదా అని ప్రశ్నించారు.