– బనకచర్లపై పిటిషన్ అంతా తప్పులదడక
– గురువు చంద్రబాబు కోసమే డ్రామాలు
– మరోమారు మండిపడ్డ బిఆర్ఎస్ నేత హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయ కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ధ్వజమెత్తారు. తన రాజకీయ గురువు చంద్రబాబు కి గురుప్రదక్షిణ చెల్లించుకునేందుకే సీఎం రేవంత్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. గోదావరి, నల్లమల కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి మొట్టికాయలు వేసిందని, కావాలనే లోపాలతో కూడిన కేసును వేయడం వల్లే ఈ కేసు నిలువదని ఉన్నత న్యాయమూర్తులు చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు చూపించుకోవడానికి కేవలం బ్యాక్ డేట్ ఉత్తరాలు రాసిందని ఎద్దేవా చేశారు. గోదావరి బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి బీఆర్ఎస్ మొత్తుకుంటూనే ఉందని హరీష్ రావు తెలిపారు. చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని చెప్పడానికి ఇంకేం ఆధారాలు కావాలి? ’నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను తిట్టినట్టు చేస్తా’ అన్నట్లుగా రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు. రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహినే కాదు, తెలంగాణకు జలద్రోహిగా కూడా మారిపోయారు‘ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై సమావేశానికి వెళ్లనని చెప్పిన రేవంత్, ఆ తర్వాత దొంగచాటుగా వెళ్లారని ఆరోపించారు. పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన, తెలంగాణ ద్రోహి అయిన ఆదిత్యనాథ్ దాస్ను కమిటీలో ఎలా నియమిస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డికి జల వనరులపై అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గోదావరి నల్లమల సాగర్పై ఆంధప్రదేశ్ టెండర్లను 11 డిసెంబర్ 2025 నాడే పూర్తి చేసిందని, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం 16 డిసెంబర్ 2025న రిట్ పిటిషన్ వేసిందని హరీష్ రావు గుర్తుచేశారు. అది డిస్మిస్ అయిన తర్వాత గత 7 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ తమాషాలు చేస్తోందని ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు రివ్యూలు చేయాల్సిన పాలకులు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ముగ్గురు సీఎంల అజెండా ఏంటో రేవంత్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ’ఎన్ఓసీ’ పేరిట తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ ఏపీకి అమ్ముకుంటున్నారని, దీనిపై అసెంబ్లీని సమావేశపరిచి చర్చ జరపాలని, దొంగచాటుగా వ్యవహారాలు నడిపితే తాము ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బనకచర్ల విషయంలో రేవంత్ తీరు అనుమానాస్పదంగా ఉందని, అందుకే ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్లలేదని పేర్కొన్నారు. తమ పార్టీ క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రశ్నించడం వల్లే ప్రభుత్వం దిగివచ్చి దేవాదుల మోటర్లను ఆన్ చేసిందని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే అక్కడ 2500 క్యూసెక్కుల నీటిని ఎత్తాల్సి ఉండగా 6 మోటర్లను మాత్రమే నడుపుతున్నారని విమర్శించారు. సమ్మక్క బ్యారేజీలో నీరు నిల్వ చేసుకుంటే పంపింగ్ చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాలా ముద్దుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఆ సమ్మక్క బ్యారేజీని నిర్మించింది ఎవరో భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని, కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను వాడుకోవడం కూడా చేతకాక కాంగ్రెస్ నేతలు కాలయాపన చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
బనకచర్లపై నోటీసులు ఇవ్వడం కుదరదు : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం స్పష్టీకరణ
న్యూదిల్లీ, జూలై 13: పోలవరం, గోదావరి నీటి -వినియోగం, బనకచర్ల అనుసంధానం అంశా పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరగా ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులు ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోపాలు సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషన్పై విచారణ జరపకుండా నోటీసులివ్వలేమని తెలిపింది. బనకచర్ల ప్రాజె క్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖ లు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక మపరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయా లన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా, ఈ పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయ్యిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒ రిజినల్ సూట్ విషయంలో నిబంధనల ప్రకా రమే విచారణకు రావాలని స్పష్టం చేసింది. రిజిస్టీ రూల్స్ ప్రకారం ఇటువంటి ఒరిజినల్ సూట్ పిటిషన్ ను ముందుగా చాంబర్ జడ్జి ముందు దాఖలు చేయాల్సి ఉంటుందని ధ ర్మాసనం పేర్కొంది. ఆ పక్రియ పూర్తికాక ముందే ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా బెంచ్ ముందుకు విచారణకు రావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అయితే అప్ప టివరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని తెలంగాణ చేసిన వాదననూ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





