– విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు
– సమగ్ర కులగణన..బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం వాదనలు
– జీవోను కొట్టేయాలని పటిషనర్ తరఫు లాయర్ వాదన
– తిరస్కరించిన ధర్మాసనం.. ట్రిపుల్ టెస్ట్ విధానంపై ప్రశ్న
– గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ , అసెంబ్లీ తీర్మానాలపై ఆరా
హైదరాబాద్, అక్టోబర్ 8 (ఆర్ఎన్ఎ): బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో బుధవారం వాదప్రతివాదనలు సాగాయి. ఇరు పక్షాలు తమ వాదనలను ధర్మాసనం ముందు బలంగా వినిపించాయి. ఇప్పటికే స్తానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినందున ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి వచ్చిన ఆవశ్యకతను ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.15గంటలకు వాయిదా వేసింది. రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటినుంచి పెండింగ్లో ఉంది? ట్రిపుల్ టెస్టు విధానం అమలు చేశారా? బీసీ రిజర్వేషన్ల పక్రియ ఎలా నిర్వహించారు? కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ చేశారా? ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా అంటూ ప్రశ్నించింది. షెడ్యూల్ నోటిఫై అయ్యిందా అని ఏజీని ప్రశ్నించింది. వాదనలు ఇంకా వినిపించాల్సి ఉన్నందున విచారణ రేపటికి వాయిదా వేయాలని ఏజీ కోరారు. ఇదిలాఉండగా, నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చేసిన జీఓ 9ను సవాల చేస్తూ సముద్రాల రమేశ్, మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జీఓను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ సోమ, మంగళవారాల్లో పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు మంగళవారం ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలాఉండగా, బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు విచారణలో ట్రిపుల్ టెస్ట్ అంశం కీలకంగా మారింది. ట్రిపుల్ టెస్ట్ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరంటూ పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్ట్పై మార్గదర్శకాలు ఉన్నాయంటూ గుర్తు చేశారు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నట్లు పిటిషనర్ తరఫు లాయర్ గుర్తు చేశారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదని, బీసీ కులగణన చేశారు కానీ బహిర్గతం చేయలేదన్నారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు అంటున్నారని, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జానాభా ఆధారం అంటున్నారని, ఎస్టీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు లేవని, ఎస్టీ, ఎస్టీల జనాభా తేలకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు ఎలా అంటూ ప్రశ్నించారు. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టివేసిందంటూ పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించారు. బిసి రిజర్వేషన్ల ఆవశ్యకతను ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈ క్రమంలో విచారణ అనంతరం గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీఓ నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చు. శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. నెలలపాటు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు. తమిళనాడులో ఒక బిల్లు ఏళ్లతరబడి గవర్నర్ వద్దే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా? ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు. వారు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల పక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయని అభిషేక్ సింగ్ వాదించారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీఓ తెచ్చారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీఓ నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తాం అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విషయమై సుప్రీంకోర్టులో కేసు వివరాలను సీజే అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసిందని ఏజీ గుర్తుచేశారు.
కూనంనేని, కృష్ణయ్య, ఇందిరా శోభన్ల ఇంప్లీడ్ పిటిషన్లు
ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాలు చేస్తూ బి.మాధవరెడ్డి, సముద్రాల రమేశ్లు పిటిషన్ దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ సోమ, మంగళవారాల్లో పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు మంగళవారం ఈ పిటిషన్లు వేశారు.
మా ఓపికను పరీక్షించకండి: పిటిషనర్లపై హైకోర్గు అసహనం
ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని పిటిషనర్లను ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఓపికను పరీక్షించకండంటూ సున్నితంగా హెచ్చరించింది. గంటలకొద్దీ ఒకే అంశం ప్రస్తావించి తమ సమయాన్ని వృథా చేయొద్దన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. పిటిషనర్ లాయర్లు ఇన్ని గంటలు వాదనలు వినిపిస్తే మాకు అవకాశం వస్తుందా అంటూ ప్రశ్నించారు. కులగణన లెక్కలు ఫోర్జరీ అనుకుంటున్నారా.. వాస్తవాలు తెలియకుండా పిటిషనర్లు ఎలా మాట్లాడుతారని అన్నారు. పిటిషనర్ల తరఫున లాయర్ సుదర్శన్ వాదనలు వినిపించారు. అయితే, నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.





