– అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం
– మీడియాతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూదిల్లీ, జనవరి 27: బడ్జెట్ సమావేశాల్లో అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే చర్చకు అనుసరించాల్సిన తీరులో ముందుకు రావాలని కూడా సూచించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతనమంగళవారం అఖిలపక్షభేటీ జరిగింది. సమావేశానంతనం వివరలాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డియాకు వెల్లడించారు. అయితే ’వీబీ జీ రామ్ జీ’ చట్టంపై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రివర్స్ గేర్ వేసి.. గతంలోకి వెళ్లలేమని, అది అసాధ్యమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఏదైనా ఒక్కసారి చట్టరూపం దాల్చాక దానిని పాటించాల్సిందేనన్నారు. ఈ నెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. ఆయా అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమావేశం అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. అయితే, బ్జడెట్ సమావేశాల నేపథ్యంలో.. సంబంధిత అంశాలపై చర్చలు జరపడమనేది నియమమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఎప్పుడూ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం నడచుకుంటామని చెప్పారు. ఎంపీలంతా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకే ఎన్నికయ్యారని, వారికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కానీ.. ఇతర సభ్యులు చెప్పేది వినడం కూడా బాధ్యతేనని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సమావేశాల అజెండా పంచుకుంటామని చెప్పారు. సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి కెఆర్ సురేశ్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ కు తుది మెరుగులు: నార్త్ బ్లాక్లో హల్వా వేడుకలు
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఏటా నిర్వహించే హల్వా వేడుకను ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పాల్గొన్నారు. అలాగే ఆర్థిక శాఖ పరిధిలోని అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపకల్పనలో భాగమైన అధికారులు కూడా హాజరయ్యారు. అనంతరం ఆమె బ్జడెట్ ప్రెస్ను పరిశీలించారు. ప్రింటింగ్, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మలా సీతారామన్ బ్జడెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా తొమ్మిదోసారి. ఒక వైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మరోవైపు మన దేశం 7.4శాతం వృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ వెలువడనుంది. హల్వా వేడుకతో బ్జడెట్ లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే బ్జడెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్లో వార్షిక పద్దును ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఒకసారి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బ్జడెట్ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే ఐదురోజులపాటు వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నమాట. 1950లో బడ్జెట్ ముద్రణ పక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అవ్వడంతో ఈ లాక్-ఇన్ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





