– యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంత్రి జితేంద్ర సింగ్
- లీకులకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా
– గతంలో లీకులు జరిగినా చర్యలు తీసుకోని ప్రభుత్వాలు
– లోక్సభలో బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూదిల్లీ, జూలై 28: భవిష్యత్తులో పేపర్ లీక్లు అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని జితేంద్ర సింగ్ అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మోదీ కృషి చేస్తున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆర్ఆర్బీ పేపర్ లీక్ అయ్యిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయని మండిపడ్డారు. అయితే పరీక్షల నిర్వహణలో సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. 2010లో ఎన్టిఎ ఏర్పాటు విజ్ఞప్తిని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ల లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందుకోసం 2024 నాటి ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి పేపర్ లీక్ నిరోధక బిల్లు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఇవి క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని, వీటిని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని సభకు వివరించారు. 2009, 2011లో ఎన్నో పేపర్లు లీకయ్యాయి. 2012లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. యూపీ, తమిళనాడుల్లోనూ ఈ ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఎన్నో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి.. వీటిని అరికట్టేందుకు 1992, 2010లోనూ ప్రయత్నాలు జరిగాయి.. అయితే అవి ఎందుకు పూర్తి కాలేదో నాటి పాలకులే సమాధానం చెప్పాలి అని అన్నారు. క్రమంగా ఇవి వ్యవస్థాగత నేరాలుగా మారాయన్నారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ విషయం తెలియగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు ఎంతో ఉపయోగకరం.. నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో నిబంధనలు రూపొందించాం.. దోషులకు శిక్షలను పదేళ్లకు పెంచాం.. లీకేజీ గ్యాంగ్లకు జరిమానాను రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచాం.. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




