– దాడి చేయమని ఎవరు ఆదేశించారో చెప్పండి
– యువత ఆలోచనలను పట్టించుకోని ప్రధాని మోదీ
– యాంటీ పేపర్ లీక్ బిల్లు చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంక
న్యూదిల్లీ, జూలై 28: నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు. వారిపై టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు.. అలాగే విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కేంద్రానికి ప్రియాంక గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు. అలాగే ప్రభుత్వ తీరును గట్టిగా తూర్పారబట్టారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ సందర్భంగా ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉందని అన్నారు. దేశ యువతను చూసి కేంద్రం భయపడుతోందని విమర్శించారు. విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందని ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులు తీవ్రవాదులు కాదు కదా? అంటూ కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏమిటని కేంద్రాన్ని నిలదీశారు. ప్రశ్నపత్రాల లీక్తో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ ఘటనలకు కారణమైన మాఫియాను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పేపర్ల లీక్ల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీక్లతో వేల మంది విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిందని ప్రియాంక గాంధీ ఆందోళన చెందారు. 152 సార్లు పేపర్ లీక్స్ జరిగాయని.. అయినా ఒక్కరిపైనా కూడా చర్యల్లేవని కాంగ్రెస్ ఎంపీ పెదవి విరిచారు. ప్రతి ఏటా బడ్జెట్లో విద్యాశాఖ కేటాయింపులను తగ్గిస్తున్నారని విమర్శించారు. పదవికి రాజీనామా చేసిన మంత్రికి ఘనస్వాగతం పలకడం.. సిగ్గుపడేలా ఉందని అన్నారు. దేశంలో యువత ఏం కోరుకుంటోందో అర్ధం కావట్లేదని ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ చురకలంటిం చారు. మహిళలను అవమానించిన ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ కేటాయించారని ఆరోపించారు. దేశంలో పరీక్షా విధానం ఘోరంగా విఫలమైందని అన్నారు. మార్చుకో వాల్సింది కెమెరా యాంగిల్స్ కాదంటూ మోదీకి సూచించారు. తన మనసులోని యాంగిల్స్ను మార్చుకోవాలని మోదీకి స్పష్టం చేశారు. తన సలహాదారులను మార్చుకోవాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ హితవు పలికారు.
మోదీకి రీల్స్పై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదు : గొగోయ్, అఖిలేశ్ విమర్శలు
నీట్ పర్ లీక్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే మోదీ మాత్రం రీల్స్ చేస్తూ కూర్చున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. సమస్యపై కాక ఇన్స్టాగ్రామ్పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. లోక్సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం 2024లో ప్రవేశపెట్టిన చట్టం కఠినంగా ఉంటే పేపర్లీక్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. లీకేజీ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తే అర్థవంతమైన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకోవట్లేదని తెలుస్తోందన్నారు. ఈ సంస్కరణలు కంటితుడుపు చర్యలే అని, గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి హామీలే ఇచ్చిందని పేర్కొన్నారు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీకేజీని ప్రస్తావిస్తూ ఆ లీకేజీ జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని గొగోయ్ గుర్తు చేశారు. అప్పుడు కూడా ఎలాంటి లీకేజీ జరగలేదని కప్పిపుచ్చడానికి ఆయన ప్రయత్నించారని దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులు ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్లో సోమవారం ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టారు. తప్పును ఎదిరించి పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థులకు గొగోయ్ ధన్యవాదాలు తెలిపారు. నిరసనకారులపై ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించారు. నిరసనకారుల తలలపై పోలీసులు కొట్టారని ఆరోపించారు. అలా కొట్టాలని వారిని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి దించి ప్రధాని మోదీని బీజేపీ కాపాడిందని సమాజ్వాదీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి తెచ్చిన యువత నిరసనలను ప్రశంసించారు. దేవాలయాల విరాళాలను దొంగిలించిన వారు ప్రశ్నపత్రాల లీకేజీని ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వెనకబడిన వర్గాల విద్యా హక్కులను దోచుకుంటోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు దేశంలోని లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. కాగా, ప్రతిపక్ష నేతల ప్రశ్నలను బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో 2014కు ముందు 22సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయన్నారు. ఇప్పుడు ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు అప్పుడు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




