- బికనీర్నుంచి 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం
- ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం
- సింధూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్ సింధూర్తో జవాబిచ్చాం
- ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక అంతే సంగతలు
- మరోమారు పాక్ను హెచ్చరించిన ప్రధాని మోదీ
మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలచేందుకు గత 11ఏళ్లుగా పెద్ద ఎత్తున కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఆయన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్టాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్గా మోదీ ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించడం గమనార్హం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునర్నిర్మించిన దేశ్నోక్ స్టేషన్ను ప్రారంభించారు. అలాగే బికనేర్-ముంబయి ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపారు. ఆయన ప్రారంభించిన స్టేషన్లలో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట ,యూపీలో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. కొత్త స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రైలు నెట్వర్క్ ఆధునికీకరిస్తున్నాం. వేగం, పురోగతికి వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రతీకలు అంటూ కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని, మన భద్రతా బలగాలు పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు . ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయంటూ ఆపరేషన్ సిందూర్ నుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని అన్నారు. రాజస్థాన్లో పర్యటిస్తున్న సందర్భంగా బికనీర్లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. ఉద్వేగంగా ప్రసంగించారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేశామన్నారు. మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులతో అనుబంధంగా ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 140 కోట్ల మంది భారతీయులను కదిలించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడంవల్లనే ఇదంతా సాధ్యమైందని మోదీ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని.. మతం ఆధారంగా వేరు చేసి.. మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని.. దానికి ప్రతీకారంగానే మన దళాలు వాళ్లను మట్టిలో పాతిపెట్టేశారన్నారు.. ఇక అణు బాంబుల బెదిరింపులకు భారత్ భయపడదని మోదీ స్పష్టం చేశారు.
’సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. నా సిరల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తోంది. పాక్లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ ఐసీయూలో ఉంది. అణబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదు. పాక్తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చల మాట అంటూ వస్తే.. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఉగ్రదాడి జరిగితే.. పాక్ ఆర్మీ, ఆర్థికవ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనం స్పష్టంచేశాం. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్కు ప్రవహించదు. భారత ప్రజల జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదు‘ అని గట్టి హెచ్చరికలు చేశారు.
అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అంతకుముందు బికనీర్లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్ను మోదీ సందర్శించారు. మరోవైపు బికనీర్ సపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు ప్రధాని మోదీ రాజస్థాన్లోని బికనీర్ ఎయిర్ బేస్ను సందర్శించడం గమనార్హం. అలాగే దేశ్నోక్లోని కర్ణిమాత ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు





