85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్, మోతుకూరు నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. ‘అలాంటి వారు తమ పెన్షన్ పేమెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి వివరాలు చెప్పాలి’ అని కొందరు అంటున్నారు. కానీ దానిలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆ వివరాలు మన డబ్బులను దొంగిలించే వారి చేతిలో పడుతాయేమోనని పెన్షనర్లు భయపడుతున్నారని నరహరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే 85 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా వారి లైఫ్ సర్టిఫికెట్ ను ఆమోదించి, లేదా కదలలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల దగ్గరికి న్యాయస్థానాలు చెప్పినట్టుగా అధికారులు తమ సిబ్బందిని పంపించి ప్రత్యక్షంగా వెరిఫై చేయించి వారి పెన్షన్లను రిలీజ్ చేయాలని మోతుకూరు నరహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. .