- ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్రెడ్డి స్పందన
- కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు హాజరవుతారు. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అన్ని విభాగాలకు అప్రమత్తత, సమన్వయంపై సీఎం దిశానిర్దేశాలు ఇవ్వనున్నారు.
భట్టి విక్రమార్కకు పిలుపు
ఇదే సందర్భంలో దిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ చేరుకోవాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దేశ రక్షణకు సంబంధించి హైదరాబాద్ కీలక కేంద్రంగా ఉండటంతో, కేంద్రంతో సమన్వయానికి రాష్ట్ర స్థాయిలో పూర్తిస్థాయి సిద్ధత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం జరగనున్న మాక్ డ్రిల్ను కూడా సీఎం రేవంత్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.