– రాష్ట్ర పార్టీ హోదా కల్పిస్తూ ఈసీ నిర్ణయం
న్యూదిల్లీ, సెప్టెంబర్ 10 : ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్ర పార్టీగా అధికారిక గుర్తింపునిచ్చింది. పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా ‘విజిల్’ను కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే కనబరిచిన అద్భుత పనితీరు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే, మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 34.92 శాతం సాధించి తన సత్తా చాటింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా దక్కాలంటే కనీసం 6 శాతం ఓట్లతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి లేదా మొత్తం ఓట్లలో 8 శాతం సాధించాలి. టీవీకే ఈ నిబంధనలను సునాయాసంగా అధిగమించి ఈ గుర్తింపును సొంతం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకేకు ‘విజిల్’ను ఉమ్మడి గుర్తుగా ఈసీ కేటాయించగా, ఎన్నికల్లో సాధించిన ఘన విజయం నేపథ్యంలో ఇప్పుడు అదే గుర్తునే శాశ్వతంగా ఖరారు చేసింది. తాజా గుర్తింపుతో భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశం లభించింది. తమిళనాడులో ఇప్పటికే గుర్తింపు పొందిన డీఎంకే, ఏఐఏడీఎంకే, సీపీఐ, వీసీకే, నామ్ తమిళర్ కట్చి, డీఎండీకే వంటి పార్టీల సరసన ఇప్పుడు టీవీకే కూడా చేరింది. ఫలితంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో టీవీకేను ఒక ప్రధాన శక్తిగా ఆవిష్కరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




