– పీఎఫ్ అడ్వాన్స్ రూల్స్లో కీలక మార్పులు
– 75 శాతం బ్యాలెన్స్ విత్డ్రాకు అనుమతి
న్యూదిల్లీ,సెప్టెంబర్ 9 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధుల పాక్షిక ఉపసంహరణ (అడ్వాన్స్) నిబంధనలను సంస్థ గణనీయంగా సరళీకరించింది. గతంలో అమల్లో ఉన్న 13 రకాల సంక్లిష్ట ఉపసంహరణ పద్ధతులను రద్దు చేసి వాటి స్థానంలో కేవలం మూడు సులభతర విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్లో సభ్యత్వం పొంది 12 నెలలు పూర్తి చేసుకున్న చందాదారులు తమ ఖాతాలోని నిల్వలో 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఖాతాలో కనీసం 25 శాతం నిల్వను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గతంలోనే ఆమోదం తెలిపింది. తాజా సవరణల ప్రకారం, ఉపసంహరణ ప్రక్రియను మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. అనారోగ్యం లేదా వైద్య చికిత్స నిమిత్తం సర్వీసు కాలంలో ఎన్నిసార్లయినా నిధులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, చదువుల కోసం 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు ఉపసంహరణకు అనుమతి ఇచ్చారు. ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణాల చెల్లింపు లేదా ఇంటి మరమ్మతుల కోసం సర్వీసు మొత్తంలో ఐదుసార్లు అడ్వాన్స్ పొందే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, సంస్థ మూసివేత, ఉద్యోగం కోల్పోవడం లేదా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు నిధులు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




