కీలక నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ
ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ
హాజరైన నగర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నివాసంలో నగర ఎమ్మెల్యేలు దాదాపు రెండు గంటల పాటు సమావేశమై.. ఈ అంశంపై చర్చించారు. అందులోభాగంగా జీహెచ్ఎంసీలో తమకున్న కార్పొరేటర్ల సంఖ్య బలంతోపాటు అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్య ఎంత అవసరమనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించారు. ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే.. జీహెచ్ఎంసీపై పట్టు జారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.





