సుడాన్ శిశువుకు పునర్జన్మనిచ్చిన‌ నీలోఫర్ వైద్యులు

కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన త‌ల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: సుడాన్‌ దేశానికి చెందిన ఓ పసి బిడ్డకు హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న బాబుకు ట్రీట్‌మెంట్ అందించి, రోగాన్ని పూర్తిగా నయం చేశారు. సుమారు నెల రోజుల పాటు నీలోఫర్‌‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సుడాన్‌ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వొచ్చారు. ఇక్కడి ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ చేయించుకోగా, నెల రోజుల క్రితం మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. బాబు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. లంగ్స్‌లోనూ సమస్య ఉన్నట్టు తేల్చారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో 6 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందించారు.

సుడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో, బాబును నీలోఫర్‌‌కు రిఫర్ చేశారు. ఆ బాబును అడ్మిట్ చేసుకున్న నీలోఫర్ డాక్టర్లు, నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు. బాబు తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. బాబు పూర్తిగా కోలుకోవడంతో, మంగళవారం డిశ్చార్జ్ చేశామని నియొనాటలజిస్ట్‌, డాక్టర్ స్వప్న తెలిపారు. తన బిడ్డకు బతికించిన డాక్టర్లకు 43ఏళ్ల  సుడాన్ మహిళ కృతజ్ఞతలు తెలియజేశారు.

తనకు ఇప్పటికే ఐదు సార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏండ్లు పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉందని తెలిసి హైదరాబాద్‌కు వొచ్చామన్నారు. అయితే, డెలివరీ తర్వాత బాబు పరిస్థితి విషమించిందని, చావు బతుకుల్లో ఉన్న తన బిడ్డకు నీలోఫర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న బాబుకు ట్రీట్‌మెంట్‌ అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ రవి కుమార్, హల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌‌వి. కర్ణన్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page